by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:41 PM
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మునిసిపాలిటీ పరిధిలోని పురుషోత్తమపట్నం పరిధిలో ఉన్న తమ స్థలాన్ని మాజీమంత్రి విడదల రజిని కుటుంబ సభ్యులు కజ్జా చేశారని అదే గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు, బత్తినేని మహాలక్ష్మి కుటుంబ సభ్యులు ఆదివారం ఆరోపించారు. సుమారు ఎకరంన్నర స్థలం బత్తినేని వంశీకులకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులదని వారు తెలిపారు. వైసీపీ అధికారంలో ఉండగా తమను బెదిరించి ఆ స్థలాన్ని విడదల రజిని మామ విడదల లక్ష్మీనారాయణ ఆక్రమించుకున్నారని వారు ఆరోపించారు. ఆ స్థలంలో స్వాతంత్య్ర సమరయోధులైన తమ కుటుంబీకుల సమాధులు కూడా ఉన్నాయని, వాటిని కూడా తొలగించారన్నారు. తమ స్థలాన్ని తమకు స్వాధీనం చేయక పోతే పురుషోత్తమపట్నంలోనే ఉండే రజినీ మామ విడదల లక్ష్మీనారాయణ ఇంటి ముందు ఆత్మహుతి చేసుకుంటామని వారు హెచ్చరించారు. వైసీపీ హయాంలో విడదల రజిని కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు, భూ కబ్జాల పై నివేదిక తయారు చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ వివరాలను సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు అందజేయనున్నట్టు వారు తెలిపారు.
Latest News