by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:41 PM
విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో బైక్లను దొంగిలించిన వ్యక్తిని సత్యనారాయణపురం పోలీసులు అదుపులోకి తీసుకొని 19 ద్విచక్రవాహనాలను స్వాదీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్ రబ్బాని పడమటలో లాడ్జిలో ఉంటున్నాడు. చెడు అలవాట్లకు బానిసై హైదరాబాద్లో భార్యాపిల్లలను వదిలేసి ఇక్కడ ఉంటున్నాడు. కేటరింగ్, కూలీ పనులు చేస్తుంటాడు. సంపాదన చాలక బైక్ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఇతడిపై గతంలో పోలీసులు కేసుపెట్టారు. 2 నెలలుగా బైక్ దొంగతనాలు అధికమవడంతో సీపీ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాల మేరకు డీసీపీ హరికృష్ణ పర్యవేక్షణలో ఏసీపీ ప్రసాద్ ఆధ్వర్యంలో మూడు స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. దొంగిలించిన బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న రబ్బానిని సీఐ వెంకట నారాయణ తన సిబ్బందితో కలిసి ఆదివారం సాంబమూర్తి రోడ్డు కొత్తవంతెన వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో నిందితుడు నగరంలో 19 బైక్లు దొంగతనం చేసినట్టు తేలింది. తమ స్టేషన్ పరిధిలో 7, అజిత్సింగ్నగర్ పీఎస్ పరిధిలో 3, సూర్యారావు పేట, మాచవరం, పటమట, గుణదల, నున్న ప్రాంతాల్లో మిగిలిన బైక్లు దొంగిలించినట్లు తేలింది. దీంతో పోలీసులు 19 బైక్లను స్వాధీనం చేసుకుని అతడిని కోర్టుకు హాజరుపరిచారు. దొంగిలించిన బైక్ల విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Latest News