by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:43 PM
చిత్తూరు జిల్లా, సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ పట్రపల్లెలో తల్లీ కూతుళ్లు బావిలో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్రపల్లెకు చెందిన సుబ్రమణ్యం కుమార్తె రాణి (25)కి ఆరేళ్ల కిందట పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన విజయకుమార్ తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు హేమశ్రీ (4), జశ్విక (2) ఉన్నారు. పట్రపల్లెలో జరిగే గంగజాతరకు రాణి తన ఇద్దరు కుమార్తెలతో కలసి శనివారం గ్రామానికి వచ్చారు. ఆదివారం జాతర నేపథ్యంలో పొలాల వద్ద ఉన్న పొలిమేర అమ్మవారి ఆలయం వద్ద పూజలకోసమని గ్రామస్తులతో పాటు కుమార్తెలు హేమశ్రీ, జశ్వికతో కలిసి రాణి వెళ్లారు. అక్కడికి సమీప బావి వద్దకు ఆమె, కుమార్తెలు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు పిల్లలు బావిలో జారి పడిపోయారు. తన ఇద్దరు కుమార్తెలను రక్షించడానికి రాణి ప్రయత్నించి మునిగి పోయారు. ఆమె అరుపులు విని సమీపంలో ఉన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వారిని రక్షించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం బావిలో వారి కోసం గాలించి మృతదేహాలను వెలితీశారు. రాణి తండ్రి సుబ్రమణ్యం ఫిర్యాదుతో ఎస్ఐ వెంకట నరసింహులు కేసు నమోదు చేశారు. ముగ్గురి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Latest News