|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 07:16 PM
ఇప్పుడంటే స్మార్ట్ఫోన్ల ద్వారా ప్రియమైన వారి క్షేమ సమాచారాన్ని క్షణంలో తెలుసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు అలా కాదు. ల్యాండ్లైన్ ఫోన్లు కూడా అందుబాటులో లేని సమయంలో ఉత్తరాలే ఎక్కువగా ఉపయోగించేవారు. తన స్నేహితుడు, తల్లిదండ్రులు, ప్రియమైన వ్యక్తుల నుంచి వచ్చే ఉత్తరం గురించి ఎదురుచూస్తున్నప్పుడు పొందే ఆ అనుభూతి వేరు. మధ్యలో వారధిలా పోస్టాఫీసు ఉండేది. పోస్టుమ్యాన్ సైకిల్ మీద వస్తున్న దృశ్యాలు.. ఆ కాలం వారికి ఇప్పటికీ కళ్లముందు కదలాడుతుంటాయి.
డిజిటలీకరణ వల్ల కమ్యూనికేషన్ కోసం ఉత్తరాలు వాడటం లేదు. దీంతో పోస్టాఫీసు పలు విధాలుగా రూపాంతరం చెందుతున్నాయి. పేమెంట్స్ బ్యాంకింగ్ రంగంలోకి కూడా ఇండియా పోస్ట్ ప్రవేశించింది. ఈ క్రమంలో ఇప్పటి యువత కోసం ఆధునిక పోస్టల్ సేవలను అందించే దిశగా పోస్టల్ విభాగం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ కాలం యువతకు మరింత దగ్గరయ్యేలా జెన్జెడ్ థీమ్లతో పోస్టాఫీసులు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ థీమ్లతో ఢిల్లీ పోస్టాఫీసులను ప్రారంభించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పోస్టాఫీసును ఏర్పాటు చేసింది.
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జెన్జెడ్ పోస్టాఫీసు ఏర్పాటు చేసినట్లు పోస్టల్ విభాగం ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. డిజిటల్ ఫస్ట్ ఇండియా కోసం ఈ పోస్టాఫీసు ఫాస్ట్, స్మార్ట్, స్టైలిష్గా ఉంటుందని వెల్లడించింది. 'ఇండియా పోస్ట్' సరికొత్త ఫ్యూచర్ ఇక్కడ ప్రారంభమవుతోందని పేర్కొంది. దీనిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. "ఆంధ్రా ఆన్ ది మ్యాప్! పోస్టాఫీస్కు కొత్త జెనరేషన్ టచ్ ఇచ్చారు! విశాఖ — ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్రంలో తొలి #GenZPostOffice ఏర్పాటు చేశారు. పూర్తిగా డిజిటల్, క్యాంపస్ కల్చర్కి అనుగుణంగా, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుని, వారి అవసరాలకు సరిపోయేలా అందుబాటులోకి తీసుకొచ్చారు. డిజిటల్ ఇండియా.. ఇప్పుడు మరింత దగ్గరైంది" అని ఎక్స్లో స్పందించారు.
కేవలం పోస్టల్ సేవలే కాదు.. ఇంకెన్నో..
ఈ జెన్జెడ్ థీమ్ పోస్టాఫీసులను ఇప్పటికే ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ గాంధీనగర్ క్యాంపస్లలో ఏర్పాటు చేశారు. ఇక్క కేవలం పార్శిళ్లు, లేఖలు పంపించడంతో పాటు సోషల్ లెర్నింగ్ ప్రదేశంగా రూపొందించారు. విద్యార్థులు ఇక్కడ కూర్చోవచ్చు. బుక్స్ చదువుకునేందుకు చిన్నపాటి లైబ్రరీ కూడా ఉంది. ఉచితంగా వైఫైను వాడుకోవచ్చు. ఈ జెన్జీ పోస్టాఫీసుల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత పార్శిల్ బుకింగ్, స్పీడ్ పోస్ట్ వంటి సర్వీసులు అందిస్తున్నారు. అయితే ఇందులో అధికారులెవరూ ఉండరు. అన్ని విద్యార్థులే స్మార్ట్ఫోన్, క్యూఆర్ కోడ్ల ద్వారా పోస్టల్ సేవలు పొందొచ్చు. వీరిక సహాయకంగా పోస్టల్ విభాగం నుంచి ఒక వ్యక్తి ఉంటారు.
గుంటూరు, కర్నూలులో కూడా..
ఈ జెన్జీ థీమ్ పోస్టాఫీసులను గుంటూరు, కర్నూలులో కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు విశాఖపట్నం రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ వీఎస్ జయశంకర్ తెలిపారు. పోస్టాఫీసులపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కొనసాగిస్తూ .. టెక్నాలజీతో యువతకకు దగ్గరగా చేయాలనే కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా విజన్కు అనుగుణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు జయశంకర్ తెలిపారు.
Latest News