|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:29 PM
ప్రస్తుతం శబరిమలలో వార్షిక అయ్యప్ప దర్శనాలు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది అయ్యప్ప స్వాములు, భక్తులు.. శబరిమల కొండకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే శబరిమల యాత్ర జరుగుతున్న నేపథ్యంలో.. కేరళ అటవీ శాఖ అధికారులు.. అయ్యప్ప భక్తులకు కీలక సూచన జారీ చేశారు. స్వామివారి సన్నిధానానికి సమీపంలో ఉన్న ఉరళ్కుళి జలపాతం వద్దకు వెళ్లడం భక్తులు మానుకోవాలని అటవీ అధికారులు సూచించారు. శబరిమల సన్నిధానానికి 400 మీటర్ల దూరంలో ఉన్న ఈ ఉరళ్కుళి జలపాతం వద్దకు భక్తులు వెళ్లడం మంచిది కాదని పేర్కొంది.
ఉరళ్కుళి జలపాతం వద్ద భక్తులకు వన్యప్రాణుల నుంచి ముప్పు ఉందని.. మరీ ముఖ్యంగా అక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారిందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భక్తుల భద్రత దృష్ట్యానే ఈ కీలక సూచనలు జారీ చేసినట్లు సన్నిధానం స్పెషల్ డ్యూటీ రేంజ్ ఆఫీసర్ అరవింద్ బాలకృష్ణన్ తెలిపారు.
సంప్రదాయ అటవీ మార్గంలో వెళ్లే కొందరు అయ్యప్ప భక్తులు .. స్నానాలు చేసేందుకు ఉరళ్కుళి వాటర్ ఫాల్స్ వద్దకు వస్తుంటారని.. అయితే వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఆ ప్రాంతంలోకి మనుషులకు ప్రవేశం నిషేధం విధించిననట్లు అటవీ అధఇకారులు స్పష్టం చేశారు. ప్రమాదాలు జరగకుండా భక్తులంతా తమ ఆదేశాలను పాటించాలని కోరారు.
ఈ ఉరళ్కుళి జలపాతం పండితవాళంకు సుమారు 400 మీటర్ల దూరంలో ఉంటుంది. సన్నిధానానికి చేరుకోవడానికి ముందు కొందరు భక్తులు అటవీ మార్గం గుండా వెళ్తూ.. ఈ వాటర్ఫాల్స్ వద్దకు చేరుకుని స్నానం చేస్తుంటారు. ఆ ప్రాంతంలో తరచూ అడవి ఏనుగుల గుంపు సంచరిస్తుందని అటవీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో జలపాతానికి దూరంగా ఉండాలని భక్తులకు గట్టి హెచ్చరికలు చేశారు.
ఇటీవలి కాలంలో ఉరళ్కుళి వాటర్ఫాల్స్ వద్ద భక్తులకు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జలపాతానికి వెళ్లే మార్గం కూడా నిటారుగా.. జారే స్వభావం కలిగి ఉండటం వల్ల ఎవరైనా జారితే తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందని అటవీ అధికారులు తెలిపారు. అయ్యప్ప దర్శనాలకు వచ్చే భక్తుల భద్రతే తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్న రేంజ్ ఆఫీసర్ అరవింద్ బాలకృష్ణన్.. అంతా భద్రతా సూచనలను కచ్చితంగా పాటించి.. అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలని కోరారు.
Latest News