|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:38 PM
ఉత్తర గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తులో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. దర్యాప్తు అధికారులు సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ క్లబ్కు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ 2024 మార్చి నెలలోనే గడువు ముగిసినట్లు గుర్తించారు. అయినప్పటికీ క్లబ్ నిర్వహణ చట్టవిరుద్ధంగా కొనసాగుతూనే ఉందని.. అందుకే దీని యజమానులు విదేశాలకు పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
గడువు ముగిసినా నైట్ క్లబ్ నిర్వహణ..
నిబంధనల ప్రకారం.. గడువు ముగిసిన లైసెన్స్ ఉన్న క్లబ్పై చర్యలు తీసుకునే అధికారం స్థానిక పంచాయతీ అధికారులకు ఉంది. కానీ పంచాయతీ అధికారులు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో యాజమాన్యం తమ ఇష్టారీతిన క్లబ్ను నిర్వహించాయి. ఈ కారణంగానే అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ అధికారులు దీన్ని పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్లబ్ నిర్వాహకుల మధ్య గతంలోనే వివాదాలు ఉండేవని.. అందుకే క్లబ్ను కూల్చి వేయాలని స్థానిక సర్పంచ్ రోషన్ రెడ్కర్ గతంలో నోటీసులు కూడా జారీ చేశారు. అయితే కొంతమంది అధికారులు దీనిని అడ్డుకున్నారని సర్పంచ్ తెలిపారు.
ఈ నైట్క్లబ్ యజమానులు గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే విదేశాలకు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. వీరిని వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు గోవా పోలీసులు ఇప్పటికే సీబీఐలోని ఇంటర్పోల్ విభాగంతో సమన్వయం చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. యజమానులపై లుక్ అవుట్ సర్క్యులర్ కూడా జారీ అయింది. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే రోమియో లేన్ పేరుతో ఉన్న మరో రెండు వాణిజ్య సంస్థలను కూడా అధికారులు సీజ్ చేశారు.
ఇదిలా ఉండగా.. సోమవారం రోజు క్లబ్ యాజమాన్యం ఈ దుర్ఘటనపై స్పందించింది. ఈ విషాదంపై "తన మనసు తీవ్రంగా కలత చెందింది" అంటూ సౌరభ్ లూత్రా తన తొలి ప్రకటన విడుదల చేశాడు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చాడు. మరోవైపు ఆదివారం రోజు తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన 25 మందిలో.. ఇప్పటి వరకు 20 మందిని అధికారులు గుర్తించారు. వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.