ఏపీలో గోల్డెన్ ట్రయాంగిల్.... సర్కారు అదిరిపోయే ప్లాన్
 

by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:42 PM

రాయలసీమ.. ఒకప్పుడు రతనాల సీమ. కానీ ఆ తర్వాత కరువు కాటకాల కారణంగా ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి తలెత్తింది. ఎకరాల కొద్దీ భూములు ఉన్నప్పటికీ, సాగునీటి వసతి లేకపోవడం, ఇతర ఉపాధి అవకాశాలేవీ లేకపోవడంతో ఈ ప్రాంత వాసులు బతుకుదెరువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. విస్తీర్ణం పరంగా చూస్తే రాయలసీమ ప్రాంతం శ్రీలంకతో సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించక యువత పొరుగు రాష్ట్రాల్లోని మహా నగరాలవైపు చూసేది. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి నీటి వసతి మాత్రమే కాకుండా.. మూడువైపులా ఉన్న మహానగరాలు కూడా కారణం అయ్యాయి. కానీ అవే మూడు మహా నగరాలను ఉపయోగించుకుని.. రాయలసీమను మరోసారి రతనాల సీమగా, రాష్ట్ర పారిశ్రామికీకరణ వ్యూహంలో కీలకమైన గోల్డెన్ ట్రయాంగిల్‌లా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది.


తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో శ్రీసిటీని అభివృద్ధి చేసిన ఏపీ.. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్‌ను ఏర్పాటు చేసి.. కరువు జిల్లాలో పారిశ్రామిక పురోగతికి బాటలు వేసింది. ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్ సమీపంలోనూ ఇలాంటి పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది.


శ్రీసిటీ.. తిరుపతి జిల్లాలో ఏర్పాటైన ప్రత్యేక ఆర్థిక మండలి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులకు చేరువగా.. చెన్నైకు దగ్గర్లో ఉండటంతో.. ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు శ్రీసిటీలో తమ యూనిట్లను నెలకొల్పాయి. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక టౌన్ షిప్‌గా శ్రీసిటీ పేరు తెచ్చుకుంది. చెన్నై మహానగరానికి కేవలం 55 కిలోమీటర్ల దూరంలో ఉండటం శ్రీసిటీకి కలిసి వచ్చే అంశం. ఇందులో ఇప్పటికే 30కి పైగా దేశాలకు చెందిన 220 కంపెనీలు తమ ప్లాంట్‌లను ఏర్పాటు చేశాయి. మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీంతో శ్రీసిటీ అభివృద్ధిపై ఏపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నిరంతర విద్యుత్, నీటి సరఫరాతోపాటుగా, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు, రోడ్లు ఏర్పాటు చేసింది. త్వరలోనే ఎయిర్ స్ట్రిప్ కూడా ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్‌గా శ్రీసిటీని తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.


తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో శ్రీసిటీని అభివృద్ధి చేస్తున్న ఏపీ.. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోనూ ఇదే తరహా ప్రణాళికను అమలు చేస్తోంది. బెంగళూరుకు ఆనుకుని ఉన్న హిందూపురం, అనంతపురం ప్రాంతాల్లో ఏరో స్పేస్, డిఫెన్స్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బెంగళూరు ఉత్తర దిశగా పరిశ్రమలు విస్తరిస్తున్న నేపథ్యంలో.. అనంతపురం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. బెంగళూరు విమానాశ్రయానికి చేరువగా ఉండటం, భూముల లభ్యతను కారణాలుగా చూపి అనంతపురం జిల్లాకు పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. డిఫెన్స్ రంగంతో పాటుగా విండ్ ఎనర్జీ, హాస్పిటాలిటీ, హార్టీకల్చర్ రంగాలలో పెట్టుబడులను రాబట్టాలని ప్రయత్నిస్తోంది.


మరోవైపు అనంతలో ఇప్పటికే కియా మోటార్స్, బర్గర్ పెయింట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. అలాగే ఎంఎస్ఎఈ పార్కుల నిర్మాణం చేపడుతున్నారు. వీటితో పాటుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్ పెట్టుబడులు పెట్టనుంది. అలాగే స్పేస్ సిటీ ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని తిమ్మసముద్రం వద్ద స్కై ఫ్యాక్టరీ.. ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. తాడిపత్రి మండలం బోగసముద్రం వద్ద సుగ్నా స్పాంజ్‌ పవర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ రెండో యూనిట్‌ను విస్తరించనుంది. ఆ రకంగా బెంగళూరుకు ఆనుకుని ఉండటం, ప్రభుత్వ భూములు అధికంగా అందుబాటులో ఉండటాన్ని అవకాశంగా మలుచుకుని ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతి సాధించాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మొత్తంగా శ్రీసిటీని ఎలక్ర్టానిక్స్ హబ్‌గా తీర్చిదిదుతున్న ఏపీ.. అనంతపురం ప్రాంతాన్ని ఏరో స్పేస్, ఆటోమొబైల్ హబ్‌గా మార్చే ప్రయత్నాల్లో ఉంది.


హైదరాబాద్ సమీపంలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ..


బెంగళూరు, చెన్నైతో పాటుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ సమీపంలో ఉండటాన్ని కూడా ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది. కేవలం 3-4 గంటల్లో హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉండటంతోపాటు.. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం.. ఈ ప్రాంతానికి కలిసి వస్తోంది. కర్నూలు బైపాస్, జాతీయ రహదారి 40, జాతీయ రహదారి 44 ఈ ప్రాంతానికి కనెక్టివిటీ పెంచుతున్నాయి. అలాగే కర్నూలు ఎయిర్‌పోర్టు సమీపంలో ఉండటం కూడా కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో ఫార్మా సంస్థలు.. ఓర్వకల్లు పారిశ్రామికవాడలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచీ ఇండస్ట్రీస్, విరూపాక్ష ఆర్గానిక్స్ వంటి కంపెనీలు కూడా ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.


కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌ను కేంద్రం సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. 4,700 ఎకరాల్లో ఈ హబ్ అభివృద్ధి చేయనున్నారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలు, నీరు, విద్యుత్ వంటి మౌళిక వసతులు కల్పించనున్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో ఫార్మా రంగంతో పాటుగా.. సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లు. స్టీల్ ప్లాంట్ యూనిట్లు నెలకొల్పనున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు చేరువగా ఉన్న ఈ మూడు ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి గోల్డెన్ ట్రయాంగిల్ చేయాలని ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ఫలిస్తే రాయలసీమ ప్రాంతం పారిశ్రామికంగా ముందంజ వేస్తుంది.


Latest News
Novelty of Rashid Khan has worn off a little, not as intimidating as before, says Kumble ahead of IPL 2026 Sun, Dec 28, 2025, 06:28 PM
Gujarat adding more than 7,000 doctors every year: CM Bhupendra Patel Sun, Dec 28, 2025, 06:27 PM
Meta-owned Instagram hit by brief outage, users report login and app issues Sun, Dec 28, 2025, 05:51 PM
India's youth must lead age of artificial intelligence: Gautam Adani Sun, Dec 28, 2025, 05:48 PM
Ratan Tata reshaped Indian enterprise with integrity: HM Amit Shah Sun, Dec 28, 2025, 05:42 PM