|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 09:32 PM
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై మరోసారి వివాదం రాజుకుంది. ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధానంపై.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వానికి సంబంధించిన 14వ రాజ్యాంగ సవరణ.. ప్రధానంగా బానిసల పిల్లల కోసమే ఉద్దేశించిందని చెప్పారు. ధనిక వలసదారులు తమ మొత్తం కుటుంబాన్ని అమెరికా పౌరులుగా మార్చుకునేందుకు ఇది మార్గం కాదని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సుదీర్ఘ వివాదంపై విచారణ చేపట్టేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
2025 జనవరిలో అధ్యక్షుడు ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దాని ప్రకారం.. అక్రమంగా దేశంలో ఉన్న వలసదారులు, తాత్కాలికంగా ఇక్కడ ఉండే పర్యాటకులకు పుట్టకతో వచ్చే జన్మతః పౌరసత్వాన్ని ఇవ్వకూడదు. ఈ నిర్ణయం అమెరికా చట్టంలో తీవ్ర చర్చకు దారితీసి, పలు ఫెడరల్ కోర్టులు దీనిపై తాత్కాలికంగా స్టే విధించాయి. అయితే జూన్లో సుప్రీం కోర్టు.. ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులు ఈ కార్యనిర్వాహక ఆదేశాన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్త ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని పేర్కొంది. డిసెంబర్ 5వ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వివాదాన్ని నేరుగా పరిష్కరించేందుకు అప్పీల్ను స్వీకరించింది. సుప్రీం కోర్టు వచ్చే వేసవిలో దీనిపై తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.
అమెరికన్ వార్తా సంస్థ 'పాలిటికో'తో మాట్లాడిన ట్రంప్.. తన కార్యనిర్వాహక ఆదేశాన్ని సమర్థించుకున్నారు. ఈ కేసు చాలా ఆసక్తికరమైనదని.. ఎందుకంటే ఆ చట్టం బానిసల పిల్లల కోసం మాత్రమే ఉద్దేశించబడిందని చెప్పారు. సివిల్ వార్ ముగిసిన సమయాన్ని, తేదీలను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుందని ఆయన అన్నారు. "ఈ చట్టం మరేదైనా దేశం నుంచి వచ్చే ఓ ధనిక వ్యక్తి.. కేవలం మా దేశంలో ఒక అడుగు పెట్టడం ద్వారా వారి మొత్తం కుటుంబం అమెరికా పౌరులు కావడానికి ఉద్దేశించినది కాదు" అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ కేసులో తమ ప్రభుత్వం ఓడిపోతే.. అది దేశానికి భారీ నష్టాన్ని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలోని పౌరసత్వ నిబంధన ప్రకారం.. అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరూ పౌరులుగా పరిగణించబడతారు. 1868లో రాజ్యాంగంలో చేర్చబడిన ఈ సవరణ "అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జన్మించినా లేదా సహజ పౌరసత్వం పొందిన, దాని అధికార పరిధికి లోబడి ఉన్న వ్యక్తులందరూ.. ఆ సంయుక్త రాష్ట్రాలకు, వారు నివసించే రాష్ట్రానికి పౌరులు అవుతారు" అని పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా ఉన్న 11 నుంచి 14 మిలియన్ల మంది వలసదారుల పిల్లలు ప్రభుత్వ లెక్కల ప్రకారం అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. విదేశీ మహిళలు కేవలం అమెరికా పౌరసత్వం కోసం వచ్చి ఇక్కడ పిల్లలను కనడంపై ట్రంప్ తరచుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Latest News