|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 09:44 PM
రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లైనా.. ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం చాలా సర్వసాధారణం అయిపోతోంది. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఇవి జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. చివరికి హత్యలు చేసే వరకు వెళ్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో భర్తను భార్య చంపడమో, భార్యను భర్త చంపడమో, లేదా మూడో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని దారుణానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఆ వ్యక్తిని హతమార్చాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా మాలెపాడు గ్రామం ఆవులపల్లెకు చెందిన ఆవుల నరసింహులు అనే 45 ఏళ్ల వ్యక్తి మ్యాజిక్లు చేస్తుండేవాడు. ఇతడు దిన్నెమీద గ్రామానికి చెందిన నాగరాజు కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో తన భార్య గంగాదేవితో నరసింహులుకు వివాహేతర సంబంధం ఉందని నాగరాజు అనుమానించేవాడు. దీంతో నరసింహులుపై పగ పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఓ ప్లాన్ వేశాడు.
పథకంలో భాగంగా నవంబర్ 20వ తేదీన మంత్రాలు చేయాలని నరసింహులుతో నమ్మబలికాడు. అనంతరం తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. తన స్నేహితుడు ముదిరాజుతో కలిసి ప్లాన్ ప్రకారం నరసింహులును షూ లేసుతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని పాతిపెట్టినట్లు సమాచారం.
మరోవైపు, నర్సింహులు కనిపించకపోవడంతో అదే రోజు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. దర్యాప్తులో భాగంగా నాగరాజుపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో నాగరాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో.. నిందితుడు నేరం అంగీకరించాడు. తన భార్యతో నరసింహులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే హత్య చేసినట్లు నాగరాజు ఒప్పుకున్నాడు. అయితే నగరాజుకు సహాయం చేసిన ముదిరాజు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నాగరాజు చెప్పిన ప్రదేశంలో నరసింహులు మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
Latest News