|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 09:43 PM
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ బీటెక్ విద్యార్థిని ఇంటికి పిలిచి దాడి చేశారు ఆమె తల్లి. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జ్యోతి శ్రవణ్ సాయి అనే 19 ఏళ్ల యువకుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అయితే శ్రవణ్ సాయి ఆమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నట్లు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. ప్రేమకు దారితీసినట్లు సమాచారం.
అయితే శ్రవణ్ సాయి బీటెక్ సెకండియర్ చదువుతుండగా.. ఆ అమ్మాయి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. వేర్వేరు చోట్ల చదువుకుంటున్నప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగినట్లు సమాచారం. శ్రవణ్ సాయి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. దీంతో పెదనాన్న వెంకటేశ్వరరావు అతని బాగోగులు చూసుకుంటున్నారు. అయితే శ్రవణ్ సాయి, యువతి ప్రేమించుకుంటున్నారనే సంగతి తెలిసిన కుటుంబసభ్యులు.. ఇరువురినీ పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. అయినా వినిపించుకోకపోవడంతో మంగళవారం రోజున శ్రవణ్ సాయిని పెళ్లి చేస్తామని నమ్మించి, మాట్లాడదాం రమ్మని యువతి కుటుంబసభ్యులు ఇంటికి పిలిపించినట్లు తెలిసింది.
ఇంటికి వెళ్లిన శ్రవణ్ సాయిని.. ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించిన యువతి తల్లి.. ఈ క్రమంలోనే అతనిపైనా, యువతిపైనా బ్యాటుతో దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రవణ్ సాయిని నిజాంపేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రవణ్ సాయి చనిపోయినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు దాడిలో గాయపడిన యువతి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. శ్రవణ్ సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం కోస పటాన్ చెరు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు తమ అమ్మాయితో ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించగా.. శ్రవణ్ సాయి ఏడాదిగా ఆమెను కలవలేదని ఎదురు తిరిగాడని యువతి కుటుంబసభ్యులు చెప్తున్నారు. దీంతో క్రికెట్ బ్యాట్తో కొట్టామని, అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో ఆసుపత్రికి తరలించామని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే పెళ్లి గురించి మాట్లాడుదామని యువతితోనే శ్రవణ్ సాయికి ఫోన్ చేయించినట్లు సమాచారం.