|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:06 PM
కేంద్ర సహాయ మంత్రి, మలయాళ సినీ నటుడు సురేశ్ గోపి ఓటు హక్కు వినియోగం కేరళలో పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన, ఇటీవల తిరువనంతపురం కార్పొరేషన్ పరిధిలోని శాస్తమంగళం డివిజన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేశారు. త్రిస్సూర్లో ఓటరుగా నమోదైన వ్యక్తి తిరువనంతపురంలో ఎలా ఓటు వేస్తారంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.ఈ అంశాన్ని మొదటగా సీపీఐ నేత, సురేశ్ గోపి చేతిలో ఓటమిపాలైన వీఎస్ సునీల్ కుమార్ లేవనెత్తారు. ఇది ఎన్నికల నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని, దీనిపై ఎన్నికల సంఘం, సురేశ్ గోపి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్రిస్సూర్ కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు జోసెఫ్ తాజెత్ కూడా స్పందిస్తూ.. సురేశ్ గోపి ప్రజలను మోసం చేశారని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.అయితే, ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికలకు వేర్వేరు ఓటర్ల జాబితాలు ఉంటాయని, విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ నేత బి. గోపాలకృష్ణన్ అన్నారు. సురేశ్ గోపి త్రిస్సూర్లోని తన ఇంటిని అమ్మేశారని, ప్రస్తుతం శాస్తమంగళంలోనే నివసిస్తున్నారని, అక్కడి స్థానిక ఓటర్ల జాబితాలో ఆయన పేరు చట్టబద్ధంగానే ఉందని స్పష్టం చేశారు.
Latest News