|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 08:24 PM
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు అనేది వజ్రాయుధం. ప్రతి పౌరుడి భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఒక శక్తివంతమైన సాధనం ఇది. ఓటు హక్కును పొందడం.. వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. కొందరు మాత్రం ఓటువేయడానికి ఆసక్తి చూపరు. అయితే, ఓ వ్యాపారవేత్త తన ఓటు హక్కును వినియోగించుకోడానికి ఏకంగా 3 వేల కిలోమీటర్ల దూరం నుంచి విమానం, హెలికాప్టర్లో వచ్చారు. అదీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం. సినిమాల్లోనే ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ, కేరళలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్లో వచ్చి ఓటేసిన వ్యాపారవేత్త మరెవరో కాదు లులూ గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ.
గల్ఫ్ దేశాల్లో వ్యాపార సామాజ్య్రాన్ని విస్తరించిన యూసఫ్ అలీ.. తన స్వస్థలం త్రిస్సూర్ జిల్లాలోని నట్టికాకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. బ్యాంకాక్ నుంచి ఆయన నేరుగా పోలింగ్ కేంద్రానికి హెలికాప్టర్లో రావడం విశేషం. ఇటీవల థాయ్లాండ్లో పర్యటించిన లులూ గ్రూప్ ఛైర్మన్.. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ లాజిస్టిక్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం థాయ్ వాణిజ్య మంత్రితో చర్చలు సహా పలు ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. తన షెడ్యూల్ ముగించుకుని అక్కడ నుంచి పోలింగ్ రోజున డిసెంబరు 11న త్రిస్సూర్కు ప్రయాణమయ్యారు.
తన ప్రైవేటు జెట్లో బయలుదేరి కొచ్చి విమానాశ్రయానికి చేరుకుని.. నట్టికాకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. తాను చదువుకున్న మోప్లా ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో యూసఫ్ అలీ ఓటు వేశారు. ఆయన చొక్కా, పంచెకట్టుతో సంప్రదాయ దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి రావడం విశేషం. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం గర్వకారణం. నేను ఎక్కడ ఉన్నా, ఓటు వేయడం నాకు ఓ లక్ష్యం’ అని యూసుఫలి అన్నారు. భారత రాజ్యాంగం బలాన్ని, స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యం ప్రాముఖ్యతను కూడా ఆయన హైలైట్ చేశారు.
అలాగే, స్థానికులతో లులూ గ్రూప్ ఛైర్మన్ అలీ ముచ్చటించారు. వారిని ఆప్యాయంగా పలకరించి, మాట్లాడారు. కాగా, గతంలోనూ పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా లులూ ఛైర్మన్ ఇదే విధంగా వచ్చి ఓటు వేయడం విశేషం. కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించారు. డిసెంబరు 11న చివర విడతలో యూసఫ్ అలీ సొంతూరు త్రిస్సూర్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియడంతో డిసెంబర్ 13న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో 1995 తర్వాత మొదటిసారి భారీ ఎత్తున పోలింగ్ నమోదైనట్లు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి షాజహాన్ వెల్లడించారు. రెండు దశల్లో మొత్తం 73.69శాతం పోలింగ్ నమోదయ్యింది. వరుసగా పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్.. ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్లు హోరాహోరీగా తలపడ్డాయి.