|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:45 PM
సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో 0-2 తేడాతో టీమిండియా టెస్ట్ సిరీస్ను కోల్పోయిన తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేయడం, ఆ తర్వాత వెస్టిండీస్తో సిరీస్ను 2-0తో గెలిచాక టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో మూడో స్థానానికి చేరింది. తాజాగా ఆరో స్థానానికి పడిపోయింది.
నిన్నా మొన్నటి వరకు పాయింట్స్ టేబుల్లో ఎక్కడో అట్టడుగున ఉన్న న్యూజిలాండ్.. ఒక్కసారిగా పైకి దూసుకొచ్చింది. వెస్టిండీస్తో తొలి టెస్టును డ్రా చేసుకుని, రెండో టెస్టులో ఘన విజయం సాధించిన కివీస్.. తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపర్చుకుంది. దీంతో ఏకంగా మూడో ర్యాంక్కు చేరుకుంది. ఫలితంగా టీమిండియాకు షాక్ తగిలింది.
డబ్ల్యూటీసీలో వరుసగా రెండుసార్లు ఫైనల్ ఆడిన టీమిండియా.. క్రితం సారి ఫైనల్ చేరలేకపోయింది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో క్లీన్ స్వీప్కు గురైంది. ఆపై ఆస్ట్రేలియాలోనూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓడిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ ఆడలేకపోయింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూటీసీ 2025-2027 సైకిల్లోనూ భారత్ దారుణ ప్రదర్శన చేస్తోంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్స్వీప్ గురవ్వడంతో మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. తాజాగా న్యూజిలాండ్ గెలవడంతో మరో స్థానం కిందకు పడిపోయింది. దీంతో ఫైనల్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.
ప్రస్తుత సైకిల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఆడిన 5 మ్యాచులలో ఆ జట్టు విజయాలు సాధించింది. 100 శాతం విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా (75 విజయశాతం), న్యూజిలాండ్ (66.670 విజయ శాతం), శ్రీలంక (66.670 విజయశాతం), పాకిస్థాన్ (50 విజయశాతం) జట్లు భారత్ కంటే ముందంజలో ఉన్నాయి. ఇంగ్లాండ్ (30.950 విజయశాతం), బంగ్లాదేశ్ (16.670 విజయశాతం), వెస్టిండీస్ (4.760 విజయశాతం)తో వరుసగా ఏడు, 8, 9 స్థానాల్లో నిలిచాయి. డబ్ల్యూటీసీ సైకిల్ ముగిసే సరికి తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. తొలి ఎడిషన్లో న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా, మూడోసారి సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ టైటిల్ సాధించాయి.