|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:41 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల్ని తీసుకొచ్చే పనిలో ఉంది.. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు మాత్రమే కాదు కేంద్రం సహకారంతో విద్యా సంస్థలు, యూనివర్శిటీలను ప్లాన్ చేస్తోంది. తాజాగా మరో సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.. రాష్ట్రంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన హస్తినలో జీఎంఆర్ సంస్థకు చెందిన ప్రతినిధులతో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ప్రతిపాదనలపై చర్చించారట.. కొన్ని ప్రణాళికులు సిద్ధం చేస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ముగింపు దశకు వచ్చాయి. ఈ ఎయిర్పోర్ట్కు సమీపంగా ఉండే విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని అన్నవరం దగ్గర ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకు భూములు అనువుగా ఉన్నాయని భావిస్తున్నారట. ఇక్కడ మాన్సాస్ ట్రస్ట్, ప్రభుత్వ, ప్రైవేట్ భూములు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. మొత్తం 500 ఎకరాల్లో ఈ సిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ ప్రాజెక్టులో జీఎంఆర్తో కలిసి అడుగులు వేయాలని భావిస్తున్నారట. ఈ నెలలో ఏవియేషన్ సిటీపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఆ తర్వాత ఒప్పందం చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్ వస్తే విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలలో విద్య, శిక్షణకు దేశంలోనే ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది. గతంలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు ఏవియేషన్ సిటీ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి భోగాపురం దగ్గరగా కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన వాస్తవరూపం దాల్చితే ఇది విమానయాన రంగంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకువస్తుంది అంటున్నారు.
ఈ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీలో విమాన ఇంజిన్ల మరమ్మత్తు, నిర్వహణ, ఏరోస్పేస్ టెక్నాలజీ, రక్షణ పరికరాల తయారీ వంటి అనేక అంశాలపై శిక్షణ అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యువతకు నైపుణ్యాభివృద్ధి చెంది, మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న అకాడమీలు చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ కొత్త ప్రాజెక్ట్ ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్ విద్యా కేంద్రంగా రికార్డు సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది.. అన్నీ కుదిరితే ఈ నెలలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కనుక ఏర్పాటైతే విశాఖపట్నం, ముఖ్యంగా భీమిలి ప్రాంతం దశ తిరిగినట్లే అంటున్నారు.
Latest News