|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:40 PM
భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్, రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మూడో మ్యాచ్లో గెలిచి.. సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి.
ఇక టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ .. గత రెండు మ్యాచ్లలో విఫలమయ్యాడు. ధర్మశాలలో జరిగే మూడో మ్యాచ్లో ఎలాగైనా రన్స్ స్కోరు చేయాలని భావిస్తున్నాడు. అయితే ఇదే సమయంలో అభిషేక్.. ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. 2016లో సూపర్ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ .. ఐపీఎల్ సహా మొత్తం 31 టీ20 మ్యాచ్లలో 89.66 సగటుతో 1,614 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలున్నాయి.
మరోవైపు అభిషేక్ శర్మ ఈ ఏడాది ఇప్పటివరకు 39 టీ20 మ్యాచ్లు ఆడాడు. అన్నిట్లో కలిపి 1,533 రన్స్ స్కోరు చేశాడు. వీటిలో మూడు శతకాలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయి. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో అభిషేక్ శర్మ మరో 81 పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేస్తాడు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. అభిషేక్ ఈజీగానే ఈ ఘనత సాధించేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇదే నెలలో భారత్.. సౌతాఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. మూడింట్లో కలిపి అభిషేక్ 81 రన్స్ చేయడం పెద్ద కష్టమేమీ కాదనే అంచనాలు ఉన్నాయి. మరో ధర్మశాలలోనే అతడు ఈ ఫీట్ సాధిస్తాడా? లేదా.. అన్నది తేలాల్సి ఉంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్.. ఆదివారం ధర్మశాల వేదికగా జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Latest News