|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 09:09 PM
తిరుపతిలో మరోసారి అన్యమత ప్రచారం వివాదం తెర మీదకు వచ్చింది. ప్రభుత్వ కళాశాలలో.. అది కూడా టీటీడీ పరిపాలన భవనానికి ఎదురుగా ఉన్న కాలేజీలోనే ఓ అధ్యాపకురాలు అన్యమత బోధన చేసింది. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో ఆమె మీద వేటు వేశారు. విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత బోధన తీవ్ర కలకలం రేపింది. కళాశాలలో కాంట్రాక్టు ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తున్న మాధవి.. క్లాస్ రూమ్ బోర్డుపై రాసిన అన్యమత వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న కళాశాలలోనే ఇలా అన్యమత ప్రచారం జరగడం పట్ల హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి. ఇది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలకు ఉపక్రమించారు. కాంట్రాక్టు అధ్యాపకురాలిని విధుల నుంచి తప్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాంట్రాక్టు లెక్చరర్ మాధవి.. విద్యార్థులకు యేసును పూజించమని, నమ్మమని చెబుతూ తరగతి గదిలో ఉన్న బోర్డుపై కొన్ని మాటలను రాశారు. తమ్ముడు, అమ్మ, నాన్న, యేసుప్రభువు.. చెల్లి, అక్క, అన్న, యేసుక్రీస్తు అని రాశారు. దీనిని అక్కడే ఉన్న కొంతమంది విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. తిరుపతిలాంటి ఆధ్యాత్మిక పట్టణంలో.. అది కూడా ప్రభుత్వ కళాశాలలో ఇలాంటి అన్యమత ప్రచారం చేయడాన్ని హిందూ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను ప్రభావితం చేసేలా ప్రవర్తించిన మాధవి తీరును తప్పుపట్టారు.
సదరు అధ్యాపకురాలికి ఆమె దేవుడి మీద దైవభక్తి ఉంటే తన నివాసంలో, చర్చిల్లో ప్రార్థనలు చేసుకోవాలి తప్ప చదువుకునే కాలేజీలకు వచ్చి ఇలాంటి ప్రచారాలు చేయడం సరికాదని హితవు పలికారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలా విద్యాసంస్థల్లో మత ప్రచారాలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను కొద్దిరోజుల క్రితమే సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని వారిపై ఈ చర్యలు తీసుకున్నారు.
Latest News