|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 10:34 PM
టోర్నీ ఏదైనా.. క్రికెట్లో పాకిస్థాన్పై భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. పురుషుల సీనియర్ జట్టు.. ఐసీసీ ట్రోఫీలతో పాటు.. ఆసియాకప్లోనూ ఆ జట్టుపై విజయాలు సాధిస్తోంది. ఆసియాకప్ 2025లోనూ మూడు సార్లు ఓడించి.. టైటిల్ ముద్దాడింది. తాజాగా ఇదే జోరును భారత పురుషుల అండర్ 19 జట్టు సైతం కొనసాగిస్తోంది. ప్రస్తుతం అండర్ 19 ఆసియాకప్ 2025 టోర్నీ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం భారత్, పాక్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 90 రన్స్ తేడాతో విక్టరీ నమోదు చేసింది.
దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ టోర్నీ వన్డే ఫార్మాట్లో జరగ్గా.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (85) టాప్ స్కోరర్గా నిలిచాడు. కనిష్క్ చౌహాన్ (46), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. ఈ మ్యాచ్లో భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (5) విఫలమయ్యాడు.
అనంతరం 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్కు.. భారత బౌలర్లు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల దెబ్బకు ఆ జట్టు టాప్ ఆర్డర్ కకావికలం అయింది. కేవలం 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. ఓటమిని ఖరారు చేసుకుంది. చివర్లో హుజైఫా అహ్సాన్ (83 బంతుల్లో 70 రన్స్) ఒంటరి పోరాటం చేశాడు. అతడి పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది తప్ప.. ఓటమిని కాదు. చివరకు పాక్.. 41.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కన్షిక్ చౌహన్ తలా మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు కిషాన్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. పేసర్ దీపేష్ పవర్ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టడం గమనార్హం. మొత్తంగా పాక్ బ్యాటర్లలో కేవలం ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. కాగా ఈ ఏడాది జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ను.. భారత్ చాలా సార్లు ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఓసారి, పురుషుల ఆసియాకప్ 2025లో మూడు సార్లు ఓటమి రుచి చూపించింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లోనూ ఆ జట్టును చిత్తు చేసింది.
Latest News