|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 10:35 PM
సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ప్రొటీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ.. ఆ జట్టు బ్యాటర్లను పెవిలియన్కు చేర్చారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో నలుగురు భారత పేసర్లు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబెలు తమ తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి.. ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించారు. దీంతో సౌతాఫ్రికా 117 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు.. తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. నాలుగో బంతికే రీజా హెండ్రిక్స్ను అర్షదీప్ ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో హర్షిత్ రాణా.. క్వింటన్ డికాక్ను పెవిలియన్ చేర్చాడు. నాలుగో ఓవర్ తొలి బంతికే బ్రెవిస్.. అర్షదీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 7 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ ముగ్గురూ సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరిపోయారు. ట్రిస్టన్ స్టబ్స్ (9), కార్బిన్ బాష్ (4) కూడా త్వరగానే ఔట్ కావడంతో సౌతాఫ్రికా.. 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత కూడా సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. కానీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (46 బంతుల్లో 61 పరుగులు) మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా స్కోరు 100 పరుగుల మార్కును దాటింది. ఆ జట్టు బ్యాటర్లలో మార్క్రమ్ కాకుండా.. డెనోవాన్ ఫెర్రీరా (20), అన్రిచ్ నోర్జే (12) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. చివరకు సౌతాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, ఒక్కో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఈ సిరీస్లో రెండు జట్లూ చెరో విజయం సాధించాయి. ఇవాళ గెలిచిన జట్టు 2-1తో ఆధిక్యంలోకి వెళ్లనుంది.
Latest News