|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 10:39 PM
ఐపీఎల్ వేలం కోసం అన్ని జట్లు తమ వ్యూహ, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కీలక ప్లేయర్లను కలిగి ఉన్నప్పటికీ.. గత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ .. తన పర్స్లో భారీగా డబ్బులను ఉంచుకుని ఇప్పుడు వేలంలోకి రానుంది. రూ. 22.90 కోట్ల పర్స్తో కీలక ప్లేయర్లను తీసుకునేందుకు రెడీ అయింది. గతేడాది వేలంలో రూ. 27 కోట్లు ఖర్చు చేసి రిషభ్ పంత్ను తీసుకుంది. అయినప్పటికీ ఈ నిర్ణయం ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదు. ముఖ్యంగా ఫినిషర్ డేవిడ్ మిల్లర్.. కీలక సమయాల్లో వికెట్ తీసే స్పిన్నర్ రవి బిష్ణోయ్ను ఒకేసారి విడుదల చేయడంతో ఇప్పుడు వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ వంటి భారీ హిట్టర్లతో లక్నో బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉన్నప్పటికీ.. గతేడాది ఏడో స్థానంలో నిలిచింది. ఈ ముగ్గురూ సీజన్ మొత్తం నిలకడగా రాణించి జట్టుకు కీలకంగా మారారు. ఇక భారీ అంచనాలతో వచ్చిన రిషభ్ పంత్.. సీజన్ మొత్తం కేవలం 269 పరుగులు మాత్రమే చేసి.. నిరాశపరిచాడు. ఇప్పుడు మిల్లర్ లేకపోవడం, పంత్ నిలకడ లేమి కారణంగా మిడిల్ ఆర్డర్పై ఆందోళనలు నెలకొన్నాయి. అందుకే ఇప్పుడు లక్నోకు వేలంలో ప్రధానంగా ఇద్దరు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల కోసం చూస్తోంది. వీరిలో ఒక విదేశీ హిట్టర్, నిలకడైన భారత బ్యాటర్ కావాల్సి వచ్చింది. ఈ రెండు స్థానాల కోసం లియామ్ లివింగ్స్టోన్, అభినవ్ మనోహర్లను తీసుకునేందుకు లక్నో ఆసక్తి చూపిస్తోంది.
భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను లక్నో రిలీజ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలి సీజన్లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న దిగ్వేష్ రాథీకి తోడుగా మరో కీలక స్పిన్నర్ను తీసుకుని.. స్పిన్ ద్వయాన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పుడు లక్నో లక్ష్యంగా పెట్టుకుంది. స్పిన్ ఆల్రౌండర్ను తీసుకుంటే బ్యాటింగ్కు కూడా పనికొస్తాడని భావిస్తోంది. ఇందుకోసం శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ లేదా రాహుల్ చాహర్నైనా తీసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.
భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని లక్నో తీసుకున్నప్పటికీ.. వయస్సు, ఫిట్నెస్ కారణంగా వచ్చే సీజన్లో అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చనే భయాలు నెలకొన్నాయి. గాయాల సమస్యతో గత రెండు సీజన్లలో చాలా మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్ల ఫిట్నెస్పైనా సందేహాలు ఉన్నాయి. అయితే లక్నోలో విదేశీ పేసర్లు, స్పిన్నర్లు లేరు. ఎకానా పిచ్కి అనుగుణంగా కటర్స్ వేయగలిగే సామర్థ్యం ఉన్న ముస్తాఫిజుర్ రెహమాన్ వంటి విదేశీ పేస్ బౌలర్ ఇప్పుడు లక్నోకు చాలా అవసరం.
లక్నో ప్రస్తుత జట్టు కూర్పు కారణంగా.. నలుగురు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు టాప్ ఆర్డర్తోనే నిండిపోయే అవకాశం ఉంది. దీనివల్ల బౌలింగ్ విభాగం పూర్తిగా స్వదేశీ ఆటగాళ్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది దేశీయ బౌలర్లపై విపరీతమైన ఒత్తిడిని తీసుకువస్తోంది. ఒకవేళ విదేశీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ను వదులుకుంటే.. స్పిన్తోపాటు లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ చేసే హసరంగా వంటి ఆల్రౌండర్ జట్టుకు కీలకంగా మారే అవకాశం ఉంది. సరైన వ్యూహంతో.. ఒక విదేశీ మిడిల్ ఆర్డర్ హిట్టర్, ఒక స్పిన్నర్, మరో భారత ఫినిషర్ను లక్నో.. ఈ మినీ వేలంలో కొనుగోలు చేయగలిగితే.. మళ్లీ టైటిల్ రేసులో నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.