|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 11:41 AM
చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) ద్వారా నాన్ కన్వర్టబుల్ బాండ్లు జారీ చేయడంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇలాంటి బాండ్లను జారీ చేసినప్పుడు రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని విమర్శించిన వారు, ఇప్పుడు అదే పని ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం బేషరతు (అన్ కండిషనల్), మార్చడానికి వీలు లేని (ఇర్రివోకబుల్) గ్యారెంటీ ఇవ్వడం, అలాగే మద్యం అమ్మకాలపై వచ్చే స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని ఎస్క్రో అకౌంట్ ద్వారా నేరుగా అప్పు తీర్చడానికి మళ్లించాలని నిర్ణయించడంపై ఆయన మండిపడ్డారు. ఎస్క్రో అకౌంట్ పెద్ద ఫ్రాడ్ అని అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు అవే విధానాలు పాటిస్తున్నాడంటే తాను ఫ్రాడ్ చేశానని ఒప్పుకుంటున్నాడా? అని నిలదీశారు. లేదా నాడు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది కరెక్టేనని ప్రజల ముందు ఒప్పుకోవాలని హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన బుగ్గన రాజేంద్రనాథ్ డిమాండ్ చేశారు. నెలకు రూ.9 వేల కోట్ల చొప్పున, 18 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.2.66 లక్షల కోట్లు అప్పులు చేసిందనీ, కానీ డిసెంబర్ 15 వచ్చినా, ఇంకా అనేక శాఖల్లో జీతాలు చెల్లించలేదని చెప్పారు. మరి తెస్తున్న అప్పంతా ఏమవుతోంది అన్న ఆయన, వాటికి లెక్కలు చూపాలని కోరారు.
Latest News