|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:02 PM
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గత నెల రోజులుగా ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార మార్పిడిపై సీఎం సిద్ధరామయ్య మళ్లీ స్పందించారు. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలనే ఒప్పందమే లేదని, తానే ఐదేళ్లూ కొనసాగుతానని ఆయన పునరుద్ఘాటించారు. అధికార మార్పిడి విషయంలో విపక్షాలు ప్రశ్నించడంపై సిద్ధూ మాట్లాడారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చివరి రోజున బెలగావీలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయించేంత వరకూ తానే సీఎంగా ఉంటానని చెప్పారు. ‘‘ప్రజలు మమ్మల్ని మొదట ఆశీర్వదించారు. ఆ తర్వాత శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకున్నారు. ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు మాత్రమే చెప్పగలను. ఇప్పటికీ నేనే ముఖ్యమంత్రిని.. అధిష్ఠానం నిర్ణయం తీసుకునేంత వరకూ పదవిలో నేనే కొనసాగుతాను’’ అని సిద్ధరామయ్య తేల్చిచెప్పారు.
అంతేకాదు, రెండున్నరేళ్ల పదవీకాలం గురించి తానెప్పుడూ మాట్లాడలేదని, అలాంటి ఒప్పందం కూడా లేదని సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. సిద్ధరామయ్యను తప్పించి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా నియమించనున్నాంటూ ప్రచారం జోరందుకోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకుని, కూర్చుకుని మాట్లాడుకోవాలని ఇరువురు నేతలకు సూచించింది. దీంతో ముందు సిద్ధరామయ్య ఇంటికి డీకే బ్రేక్ఫాస్ట్ విందుకు వెళ్లగా.. తర్వాత డిప్యూటీ సీఎం ఇంటికి సిద్ధూ వచ్చారు.
‘మీరు లెజిస్లేటివ్ పార్టీలో ఐదేళ్లకు ఎన్నికయ్యారు.. మరి రెండున్నరేళ్ల మాటేంటి?’ అని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత ఆర్ అశోకా ప్రశ్నించారు. దీనికి సిద్ధరామయ్య దీనిపై ఎలాంటి అగ్రిమెంట్ లేదని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య ఆధిపత్య పోరు కారణంగా రాష్ట్ర ప్రయోజనాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ విమర్శిస్తోంది. కాగా, 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డికే శివకుమార్ల మధ్య పోటీ కొనసాగింది. దీంతో ఇద్దరూ నేతలను కాంగ్రెస్ అధిష్ఠానం కూర్చోబెట్టి మాట్లాడి, డీకేకు నచ్చజెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే, సీఎం పదవి చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా అప్పుడు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
Latest News