|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 08:24 PM
ఆఫ్రికా దేశమైన దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం రేగింది. జోహెనెస్బర్గ్లో ఆదివారం తెల్లవారుజామున ఓ బార్ వెలుపల గుర్తుతెలియని వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. మరో 10 మందికిపైగా గాయపడ్డారు. బంగారు గనుల ప్రాంతం బెకర్స్డాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. టావెర్న్పై తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో తొలుత 10 మంది చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. కానీ, తరువాత సంఖ్యను తగ్గించారు.
‘‘రెండు వాహనాల్లో వచ్చి దాడి చేసిన దుండుగులు ‘టావెర్న్ కస్టమర్లపై దాడి చేశారు.. వారు అక్కడి నుంచి పారిపోతుండగా యాదృచ్ఛికంగా కాల్పులు జరిపారు’’ అని పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుల్లో బార్ వెలుపల ఉన్న ఆన్లైన్ కార్-హెయిలింగ్ సర్వీస్కు చెందిన డ్రైవర్ కూడా ఉన్నాడని ప్రావిన్షియల్ పోలీస్ కమిషనర్ మేజర్ జనరల్ ఫ్రెడ్ కెకానా తెలిపారు. దాడికి పాల్పడిన దుండగుల కోసం గాలింపు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆఫ్రికా ఖండంలోనే అత్యంత పారిశ్రామికీకరణ చెందిన దేశమైన దక్షిణాఫ్రికాలో వ్యవస్థీకృత నేరాలు, అవినీతితో సతమతమవుతోంది. గ్యాంగ్వార్లు, అనధికారిక వ్యాపారాల మధ్య పోటీ కారణంగా అక్కడ కాల్పులు సర్వసాధారణమైపోయాయి. ఈ నేరాలు ప్రపంచంలోనే అత్యధిక హత్యల రేటుకు దోహదం చేస్తున్నాయి.
డిసెంబర్ 6న, రాజధాని ప్రిటోరియా సమీపంలోని సౌల్స్విల్లే టౌన్షిప్లోని హాస్టల్పై ముష్కరులు దాడి చేసి, మూడేళ్ల చిన్నారితో సహా 12 మందిని చంపారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న ప్రదేశంలో కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. దక్షిణాఫ్రికాలో చాలా మంది వ్యక్తిగత రక్షణ కోసం గన్ లైసెన్స్లు, సాపేక్షంగా కఠినమైన యాజమాన్య చట్టాలు ఉన్నప్పటికీ, చట్టవిరుద్ధమైన తుపాకులు చెలామణిలో ఉన్నాయి. పోలీసు డేటా ప్రకారం.. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాల్పుల్లో రోజూ సగటున 63 మంది మరణించారు. చాలా మరణాలు వాగ్వాదాలు కారణంగానే చోటుచేసుకున్నాయి. దోపిడీలు, ముఠా హింస కూడా మరణానికి కారణమయ్యాయి.
గతేడాది సెప్టెంబరులో తూర్పు కేప్ ప్రావిన్స్ల్లో ఓ గ్రామంలో 18 మంది బంధువులు కాల్పుల్లో మరణించిన ఘటన ఇటీవలి కాలంలో ఆ దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది.
Latest News