|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 09:28 PM
పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఎస్ఐ కుమారుడు వెంకట నాయుడు, అతడి గ్యాంగ్ కార్ల చోరీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ గ్యాంగ్ మీద మరో కేసు నమోదైంది. వీరు ఫైనాన్స్ కంపెనీలో కారు లోన్ తీసుకుని, ఈఎంఐలు చెల్లించకుండా తప్పించుకు తిరగడమే కాక, కార్లను అమ్మారని తెలిసింది. వీరి మీద నర్సరావుపేట చోళ మండలం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో ఈ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
నర్సరావుపేట చోళ మండలం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ భరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కొత్త కేసు నమోదైంది. ఆయన ఫిర్యాదు ప్రకారం, ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్న ముగ్గురు వ్యక్తులు, ఆ కార్ల కిస్తీలు చెల్లించకుండా వాటిని అమ్మేశారు. అంతేకాకుండా, ఫైనాన్స్ ఉన్న కార్లను కొనుగోలు చేసిన వ్యక్తులు వాటికి నకిలీ నంబర్లు వేసి అమ్మినట్లు భరత్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నర్సరావుపేట వన్ టౌన్ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఏఎస్ఐ కుమారుడు వెంకట నాయుడు గ్యాంగ్కు కార్లు అందిస్తున్న అంజీ, భానులు కూడా ఉన్నారని తెలిపారు.
ఆర్టీఓ అధికారులు పరిశీలినలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెంకట నాయుడు గ్యాంగ్ అమ్మిన కొన్ని కార్లకు నకిలీ నంబర్లు వేయడం మాత్రమే కాక.. కొన్నింటికి ఛాసిస్ నంబర్లను కూడా ట్యాంపరింగ్ చేసినట్లు ఆర్టీవో అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా, నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఓ అధికారి కుమారుడే ఈ వెంకట నాయుడు. అతడు నకిలీ పోలీస్ ఇన్స్పెక్టర్ అవతారమెత్తి, మరికొందరు వ్యక్తులతో కలిసి ఒక బృందంగా ఏర్పడ్డాడు. వీరంతా... జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను అడ్డగించి, డ్రైవర్లు, క్లీనర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేవారు.
ఈ క్రమంలో డిసెంబర్ 4వ తేదీన ఈ గ్యాంగ్, చిలకలూరిపేట నేషనల్ హైవేపై నాదెండ్ల మండలం గణపవరం వద్ద ఈ గ్యాంగ్ ఒక భారీ కంటైనర్ను ఆపడానికి ప్రయత్నించింది. ఇందుకోసం ఈ గ్యాంగ్, ట్రాక్టర్లతో వెళ్తున్న కంటైనర్కు కారు అడ్డంగా పెట్టారు. అయితే, కంటైనర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో కంటైనర్ వెనుక నుంచి అతి వేగంగా వస్తున్న ఒక కారు వస్తుంది.
సడెన్గా బ్రేక్ వేయడంతో అది కాస్త కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు చనిపోయారు. వీరంతా విజ్ఞాన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు అని తెలిసింది. విద్యార్థులంతా అయ్యప్ప మాల ధరించి, శబరిమల యాత్రకు వెళ్లేందుకు స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదం అప్పట్లో ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అలానే సంఘటన స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పరిశీలించారు. డ్రైవర్ చెప్పిన ఆధారాలతో నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారంలో వాహనాలు ఆపుతున్న వారిని గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఏఎస్ఐ కుమారుడు వెంకట నాయుడు కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. దీంతో అతడితో పాటు మరికొందరి మీద కేసు నమోదు చేశారు.