|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 09:14 PM
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనను, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. యోగి ‘రెండు నమూనాల’ వ్యాఖ్యలు బీజేపీలో ఆధిపత్య పోరును బయటపెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. కోడిన్ కాఫ్ సిరప్ అక్రమ రవాణాపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు.
కోడిన్ సిరప్ అక్రమ రవాణా వల్ల వందల మంది చిన్నారులు చనిపోయారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. ఉత్తరప్రదేశ్లో ఒక్క చిన్నారి కూడా దగ్గు సిరప్ వాడకం వల్ల చనిపోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎవరి పేరు ప్రస్తావించకుండా, ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ సభ్యుల వంక చూసి మాట్లాడుతూ.. ‘‘రెండు నమూనాలు ఉన్నాయి.. ఒకటి ఢిల్లీలో, మరొకటి లక్నోలో. దేశంలో ఎప్పుడు చర్చ జరిగినా అతడు విదేశాలకు పారిపోతాడు. మీ బాబువాకు కూడా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను.. అతడు ఇంగ్లాండ్ వెళ్తాడు, మీరు ఇక్కడ అరుస్తూ ఉంటారు’ అని అన్నారు.
ఎవరు పేరు ప్రస్తావన తీసుకురానప్పటికీ యోగి వ్యాఖ్యలు పరోక్షంగా రాహుల్ గాంధీ , అఖిలేష్ యాదవ్ లను ఉద్దేశించినవే. గతంలో కూడా రాహుల్, అఖిలేష్, తేజస్వీ యాదవ్లను ‘మూడు కోతులు’గా అభివర్ణించిన యోగి.. వారిని ‘పప్పు’, ‘టప్పు’, ‘అప్పు’ అని ఎగతాళి చేశారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో ‘‘మహాత్మా గాంధీకి మూడు కోతులు ఉన్నట్లే, ఈరోజు ఇండియా కూటమి పప్పు, టప్పు, అప్పు (రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్, అఖిలేష్ యాదవ్) పేరుతో మూడు కోతులను తీసుకువచ్చింది. పప్పు నిజం చెప్పలేడు లేదా మంచిగా ఏమీ చెప్పలేడు. టప్పుకు నిజం కనిపించదు, అప్పుకు నిజం వినబడదు’ అని ఆయన అన్నారు.
అసెంబ్లీలో యోగి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్)లో అఖిలేష్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి నిజం అంగీకరించారని కౌంటర్ ఇచ్చారు.‘"ఢిల్లీ-లక్నో ఘర్షణ ఇంత దూరం వస్తుందని ఎవరూ అనుకోలేదు.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు లక్ష్మణ రేఖను దాటకూడదు. బీజేపీ తమ అంతర్గత పోరును బయటపెట్టుకోరాదు’’ అని ఎస్పీ అధినేత అన్నారు. యోగి ఆదిత్యనాథ్ తన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే యాదవ్ స్పందించడం విశేషం.
యోగి ఆదిత్యనాథ్.. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం మధ్య అధిపత్య పోరు జరుగుతోందని సమాజ్వాదీ పార్టీ పదేపదే ఆరోపిస్తోంది. డిప్యూటీ సీఎంలు, కొందరు అధికారుల నియామకం వంటివి ముఖ్యమంత్రి అధికారాలను పరిమితం చేసే ప్రయత్నాలేనని పలువురు అంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. పార్టీ వల్లే తాను ఈ ఉన్నత పదవిలో ఉన్నానని ఆయన తెలిపారు.
Latest News