|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 07:25 PM
ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు సేవలు అందిస్తున్నాయి. అయితే ఈ ఏడు విమానాశ్రయాలకు అదనంగా మరో ఏడు ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇందులో భాగంగా రాష్ట్రంలో నాలుగు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా.. కేంద్రం నుంచి ఆమోదం కూడా లభించింది. దీంతో ఆ నాలుగు చోట్ల ఎయిర్పోర్టుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.
ఇటీవల జరిగిన ఏపీ మంత్రిమండలి సమావేశంలో దగదర్తి విమానాశ్రయం అభివృద్ధి కోసం దామవరం వద్ద సర్వే నంబర్ 1/1లోని 418.14 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భూసేకరణ కోసం ప్రభుత్వం పరిహారం నిర్ణయించింది. ఎకరాకు రూ.13 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు భూసేకరణకు సంబంధించిన నివేదికను స్థానిక కలెక్టర్ ఇప్పటికే ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదికను పరిశీలించిన కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజాగా పరిహారం కూడా నిర్ణయించింది.
మరోవైపు మొదటి విడత కింద రూ.916 కోట్లతో దగదర్తి ఎయిర్పోర్టు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దగదర్తి ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టారు. త్వరలోనే కాంట్రాక్టర్ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు దగదర్తి విమానాశ్రయ నిర్మాణం పూర్తై.. అందుబాటులోకి వస్తే నెల్లూరు జిల్లా ఆర్థికంగా, పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు చెప్తున్నారు. అలాగే జిల్లాకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని.. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఒక్క నెల్లూరు జిల్లాకు మాత్రమే కాకుండా కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
Latest News