|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 07:38 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాలో అధిక వడ్డీని ఆశ చూపించి ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన శ్రేయ గ్రూప్ ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రేయ గ్రూప్ మీద ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా శ్రేయ గ్రూప్ ఆస్తులను జప్తు చేయడానికి సీఐడీ అధికారులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ పేరుతో కర్నూలు జిల్లాలో ఈ సంస్థ మోసానికి పాల్పడింది. ప్రజలకు అధిక వడ్డీని ఆశ చూపి వారి నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు స్వీకరించింది. పెట్టుబడి పథకాలు అంటూ వివిధ పేర్లతో ప్రచారం చేసి.. కర్నూలు జిల్లాలో సుమారుగా 8 వేలమంది డిపాజిటర్ల నుంచి డిపాజిట్లు వసూలు చేసింది. ఈ మొత్తం రూ.206 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
డిపాజిట్లు పెట్టిన స్థానికులు.. ఆ తర్వాత తమ డబ్బులు వెనక్కి ఇవ్వకపోవటంతో మోసపోయామని గుర్తించారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శ్రేయ గ్రూప్ వ్యవహారంలో.. ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని సీఐడీని ఆదేశించింది. అలాగే శ్రేయ గ్రూప్ సంస్థ ఆస్తులను జప్తు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ కేసులో నిందితులు హేమంత్ రాయ్, సంగీతా రాయ్ పేరు మీద ఉన్న ఆస్తులను కూడా జప్తు చేయాలంటూ.. సీఐడీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాలలో ఉన్న 51.55 ఎకరాలను సీఐడీ అధికారులు జప్తు చేయనున్నారు.
మరోవైపుఈ కేసులో ఏ1 శ్రేయ గ్రూప్ను పేర్కొన్న పోలీసులు, ఏ2గా హేమంత్కుమార్ రాయ్, ఏ3గా సంగీత రాయ్ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లతో పలు చోట్ల ఆస్తులు కొన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోతదుపరి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీజీపీని ఆదేశించింది.
మరోవైపు ఇలాంటి మోసాలు నిత్యం వెలుగుచూస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిక వడ్డీ, అధిక లాభాలు అనేసరికి మోసపోవద్దని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. సురక్షితమైన పెట్టుబడి మార్గాలలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Latest News