|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:07 PM
కోట్లాది మంది భారతీయుల కలల ప్రాజెక్టు బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 2027 ఆగస్టు 15వ తేదీన అంటే భారత 81వ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా దేశంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ చారిత్రాత్మక మైలురాయికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. జపాన్కు చెందిన అత్యాధునిక షింకన్సేన్ సాంకేతికతతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు.. భారత ప్రయాణ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది.
దశలవారీగా ప్రారంభం..
ముంబై - అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న 508 కిలోమీటర్ల ఈ కారిడార్ను ప్రభుత్వం దశలవారీగా ప్రారంభించనుంది. మొదటి దశలో భాగంగా.. గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా మధ్య 47 కిలోమీటర్ల మేర తొలి బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. ఇక ఆ తర్వాత వాపి - సూరత్, ఆపై వాపి - అహ్మదాబాద్ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. చివరి దశలో భాగంగా థానే - అహ్మదాబాద్ మార్గం పూర్తయ్యాక, చివరగా ముంబై - అహ్మదాబాద్ పూర్తి కారిడార్ అనుసంధానం అవుతుంది.
ఇదిలా ఉండగా.. బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. సాధారణంగా రైలులో ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లడానికి 7 గంటలకు పైగా సమయం పడుతుండగా.. బుల్లెట్ రైలు ద్వారా ఈ సమయం భారీగా తగ్గనుంది. కేవలం 4 స్టేషన్లలోనే ఆగితే.. ఈ దూరాన్ని కేవలం 1 గంట 58 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తం 12 స్టేషన్లలో ఈ రైలు ఆగితే.. ప్రయాణ సమయం 2 గంటల 17 నిమిషాలు పడుతుంది.
ముఖ్యమైన స్టేషన్లు ఇవే..!
ఈ హై-స్పీడ్ కారిడార్లో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. అవి.. సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి (గుజరాత్), బోయిసర్, విరార్, థానే, ముంబై (మహారాష్ట్ర). మొత్తం మార్గంలో 352 కి.మీ. గుజరాత్, దాద్రా నగర్ హవేలీలో ఉండగా.. 156 కి.మీ. మహారాష్ట్రలో ఉంది.
నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం.. ఇప్పటికే 330 కిలో మీటర్ల మేర వయాడక్ట్ నిర్మాణం పూర్తయింది. ఈ మార్గంలో నిర్మిస్తున్న 25 నదీ వంతెనల్లో 17 వంతెనలు పూర్తి కావడం విశేషం. ముఖ్యంగా సూరత్ స్టేషన్ నిర్మాణాన్ని డైమండ్ పరిశ్రమ థీమ్తో అద్భుతంగా రూపొందిస్తున్నారు. దాదాపు రూ. 85,801 కోట్లకు పైగా ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. ఒకప్పుడు కేవలం కలగానే మిగిలిపోయిన బుల్లెట్ రైలు ప్రయాణం.. మరో 18 నెలల్లోనే భారతీయులకు అందుబాటులోకి రానండగా.. అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Latest News