|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 10:57 PM
విజయ్ హజారే ట్రోఫీ 2025–26లో కర్ణాటక ఓపెనర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ఫామ్తో దూసుకుపోతున్నాడు. శనివారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో త్రిపురపై సెంచరీ సాధించిన పడిక్కల్, కేవలం ఐదు ఇన్నింగ్స్ల్లోనే నాలుగో శతకాన్ని నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాడు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన త్రిపుర బౌలింగ్ ఎంచుకుంది. అయితే కర్ణాటక ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ ఇద్దరూ తొలి మూడు ఓవర్లలోనే ఔటై, స్కోరు 6/2కి పడిపోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితిలో పడిక్కల్ మరోసారి జట్టుకు అండగా నిలిచాడు. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కబెట్టిన అతడు, కీలక 136 పరుగుల భాగస్వామ్యం ద్వారా కర్ణాటకను మళ్లీ మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్తో కలిసి మరో 65 పరుగుల విలువైన స్టాండ్ జోడించాడు. రాహుల్ 35 పరుగులు చేయగా, చివర్లో స్మరణ్ 60 పరుగులతో స్కోరు పెంచడంలో సహకరించాడు.
38వ ఓవర్లో సింగిల్తో సెంచరీ పూర్తి చేసిన పడిక్కల్ జట్టును ముందుకు తీసుకెళ్లగా.. ఆ తర్వాత స్మరణ్, అభినవ్ మనోహర్ రాణించడంతో కర్ణాటక జట్టు 50 ఓవర్లలో 332/7 అనే భారీ స్కోర్ చేసింది. ఈ శతకం పడిక్కల్కు లిస్ట్-ఏ క్రికెట్లో 13వ సెంచరీగా నిలిచింది. ఈ సీజన్ ఆరంభంలో జార్ఖండ్పై 147, కేరళపై 124 పరుగులతో అదరగొట్టిన పడిక్కల్.. తమిళనాడు మ్యాచ్లో విఫలమైనప్పటికీ పుదుచ్చేరిపై 113 పరుగులతో గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు త్రిపురపై మరో సెంచరీతో తన సూపర్ ఫామ్ను నిరూపించాడు. త్రిపురపై 120 బంతులు ఆడిన దేవదత్ పడిక్కల్ 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు.
ఐదు ఇన్నింగ్స్ల్లో నాలుగు శతకాలతో పడిక్కల్ ప్రస్తుతం టోర్నీలో టాప్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే 500కి పైగా పరుగులు, 100కి మించిన సగటు, స్ట్రయిక్ రేట్తో పాటు 45 బౌండరీలు బాదాడు. త్వరలో న్యూజిలాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డేల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుండగా పడిక్కల్ పేరు గట్టిగా వినిపిస్తోంది.
Latest News