|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 08:10 PM
వెనిజులాలో నికోలస్ మదురో అధికార పతనంతో ప్రపంచ చమురు మార్కెట్లో పెను మార్పులు రానున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న వెనిజులాను తన నియంత్రణలోకి తీసుకోవడం ద్వారా.. అమెరికా ఇంధన రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. అయితే తక్షణం ధరల్లో భారీ మార్పులు లేకపోయినా.. భవిష్యత్తులో వెనిజులా చమురు ఉత్పత్తి పెరిగితే అంతర్జాతీయ మార్కెట్ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధికంగా సుమారు 303 బిలియన్ బ్యారెళ్లు అంటే ప్రపంచ చమురు నిల్వల్లో 18 శాతం ఉన్నాయి. అయినప్పటికీ.. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్పై ఈ వెనిజులా సంక్షోభం ప్రభావం పరిమితంగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వెనిజులాలో అపారమైన చమురు నిల్వలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ప్రపంచ ఉత్పత్తిలో కేవలం 1 శాతం మాత్రమే వాటాను కలిగి ఉంది. కాబట్టి.. ప్రస్తుతానికి ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో పెద్దగా లోటు రాకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వెనిజులాలో లభించేది భారీ చమురు.. అయితే దీన్ని శుద్ధి చేయడానికి అత్యాధునిక రిఫైనరీలు అవసరం. కానీ దశాబ్దాల తరబడి పెట్టుబడులు లేక వెనిజులాలో ఆయిల్ రిఫైనరీలు, మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తమ దేశానికి చెందిన దిగ్గజ చమురు కంపెనీలు వెనిజులాలోకి ప్రవేశించి.. బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలను బాగు చేస్తాయని ప్రకటించారు. అంటే వెనిజులా నుంతి చమురు ఉత్పత్తిని భారీగా పెంచాలన్నది అమెరికా ప్లాన్గా అంతా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వెనిజులాలో ఉన్న చమురుకు చైనా అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. అమెరికా నియంత్రణలోకి ఈ చమురు నిల్వలు వెళ్తే.. చైనాకు తక్కువ ధరలో లభించే చమురు సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.
భారత్కు వెనిజులా చమురు పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ.. గత కొన్ని ఏళ్లుగా అమెరికా ఆంక్షల వల్ల దిగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే అమెరికా పర్యవేక్షణలో చమురు ఉత్పత్తి పెరిగితే.. భవిష్యత్తులో భారత్కు ఇది ఒక ప్రత్యామ్నాయ చమురు వనరుగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఓఎన్జీసీ వంటి భారత ఆయిల్ కంపెనీలకు అక్కడ ఉన్న బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Latest News