|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 08:33 AM
వెనిజువెలాలో తాత్కాలిక నాయకత్వం తమ డిమాండ్లకు లొంగిపోకపోతే, ఆ దేశంపై 'రెండో విడత' దాడులకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత వెనిజులాలో ప్రస్తుతం తామే అధికారంలో ఉన్నామని ఆయన ప్రకటించారు. వెనిజువెలాను గాడిలో పెట్టడమే తమ లక్ష్యమని, అవసరమైతే మళ్లీ సైనిక చర్యకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.వెనిజువెలాను ఒక ‘మృత దేశం’గా అభివర్ణించిన ట్రంప్ఆ దేశం కుప్పకూలడానికి దశాబ్దాల దుష్పరిపాలనే కారణమని విమర్శించారు. వెనిజువెలాలోని అపారమైన చమురు నిక్షేపాలు, సహజ వనరులపై అమెరికాకు పూర్తి అధికారం కావాలని ఆయన డిమాండ్ చేశారు. దెబ్బతిన్న చమురు మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి అమెరికా చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, భారీ పెట్టుబడులు అవసరమని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, మదురో బంధీ కావడాన్ని వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పద్రినో లోపెజ్ 'సామ్రాజ్యవాద దురాక్రమణ'గా అభివర్ణించారు. మదురోను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూనే, ప్రస్తుతానికి తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. అమెరికా చర్యల పట్ల స్పెయిన్, బ్రెజిల్, చిలీ, కొలంబియా వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదముందని హెచ్చరించాయి.ప్రస్తుతం కరీబియన్ ప్రాంతంలో అమెరికా తన 15,000 మంది సైనికులను సిద్ధంగా ఉంచింది. మరోవైపు వెనిజువెలా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడంతో కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో 30,000 మంది సైనికులను సరిహద్దుకు తరలించారు. కారకాస్లోని ప్రజలు తదుపరి దాడులు జరుగుతాయన్న భయంతో నిత్యావసర వస్తువుల కోసం సూపర్ మార్కెట్ల వద్ద బారులు తీరారు.
Latest News