సుంకాలు తగ్గించండని భారత్ కోరింది,,,,అమెరికా సెనెటర్ సంచలనం
 

by Suryaa Desk | Mon, Jan 05, 2026, 09:23 PM

అగ్రరాజ్యం అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరోసారి ఉత్కంఠకు దారితీస్తున్నాయి. దిగుమతి సుంకాలు తగ్గించాలని భారత్ తమను కోరిందంటూ అమెరికా సెనెటర్ లిండ్జీ గ్రాహమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రాతో జరిగిన అత్యంత రహస్య సంభాషణను ఆయన మీడియా ముందు బహిర్గతం చేయడం దౌత్య వర్గాల్లో కలకలం రేపుతోంది.


రాయబారితో చర్చల గుట్టు రట్టు!


దాదాపు నెల రోజుల క్రితం భారత రాయబారి క్వాత్రా నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన చర్చల గురించి గ్రాహమ్ వివరించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా తగ్గించుకుందని క్వాత్రా తనకు తెలిపినట్లు సెనెటర్ పేర్కొన్నారు. "మేము రష్యా ఆయిల్ కొనుగోలును తగ్గించాం.. కాబట్టి ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పి, మాపై ఉన్న 25 శాతం సుంకాన్ని తగ్గించేలా చూడండి" అని భారత రాయబారి విజ్ఞప్తి చేసినట్లు గ్రాహమ్ వెల్లడించారు. లిండ్జీ గ్రాహమ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన పక్కనే ఉండటం గమనార్హం. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం పన్ను విధిస్తామని.. దానిని ఒక 'ఆర్థిక బంకర్ బస్టర్'లా ప్రయోగిస్తామని గ్రాహమ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.


 మరోవైపు భారత్‌పై సుంకాల అస్త్రాన్ని ప్రయోగించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. "ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. కానీ నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు బాగా తెలుసు. నన్ను సంతోషపెట్టడం (భారత్‌కు) చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేము సుంకాలను చాలా వేగంగా పెంచుతాము" అని ట్రంప్ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్‌ను శ్వేతసౌధం తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా షేర్ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.


ప్రస్తుతం భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం వరకు సుంకాలు విధించింది. అయితే రష్యా చమురు విషయంలో భారత్ తమకు సహకరించకపోతే ఈ సుంకాలను మరిన్ని రెట్లు పెంచుతామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది భారత వస్త్ర రంగం, రత్నాలు, ఆభరణాలు, ఐటీ సేవల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించి.. ఆ దేశ చమురుపై పట్టు సాధించిన ట్రంప్ ఇప్పుడు భారత్ ద్వారా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూ అమెరికా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.

Latest News
'He walks the talk...,' Shreyas lauds Kohli's years of consistency Mon, Jan 12, 2026, 11:18 AM
Karur stampede case: Vijay to appear before CBI today in Delhi Mon, Jan 12, 2026, 10:59 AM
Trump says only his 'morality' limits his power Mon, Jan 12, 2026, 10:56 AM
Swami Vivekananda carried India's eternal wisdom to world: Prez Murmu on National Youth Day Mon, Jan 12, 2026, 10:45 AM
Bayern rout Wolfsburg to tighten grip on Bundesliga summit Mon, Jan 12, 2026, 10:41 AM