|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 08:17 PM
డాక్టర్ అంబేద్కర్కోనసీమ జిల్లా మలికిపురంలోని ఇరుసుమండలో గ్యాస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇరుసుమండ బ్లోఅవుట్లో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సిబ్బంది మంటలను నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు. అయితే ఇరుసుమండ బ్లోఅవుట్ నిలిచిపోవటానికి ఇంకా ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బ్లోఅవుట్లో 95 శాతం కట్టడి చేశామని.. మరో ఐదురోజుల పాటు బ్లోఅవుట్ కొనసాగుతుందన్నారు. అయితే ప్రమాదమేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. పైపుల సాయంతో గూడవల్లి పంట కాల్వ నుంచి నీటిని మళ్లించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ కూడా.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. కూలెంట్ ఆయిల్ సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. బ్లోఅవుట్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత.. ఈ ఘటన ఎలా జరిగింది.. దీనికి బాధ్యులు ఎవరనే అంశంపై దృష్టి సారించనున్నారు.
మరోవైపుకోనసీమ గ్యాస్ లీక్నేపథ్యంలో చుట్టుపక్కల వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 500 కుటుంబాలను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ వెల్లడించారు. వారికి అన్ని సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. మరోవైపు గ్యాస్ లీక్, భారీగా మంటలు ఎగసిపడిన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో భారీగా పంట నష్టం సంభవించింది. పెద్దఎత్తున కొబ్బరి చెట్లు కాలిపోయాయి. అలాగే పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కాలిపోయిన కొబ్బరిచెట్లకు, దెబ్బతిన్న పంటలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కోనసీమ జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
కోనసీమ బ్లోఅవుట్ - చంద్రబాబు సమీక్ష
కోనసీమ బ్లోఅవుట్పై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా.. వారికి తాజా పరిస్థితులను వివరించాలని సూచించారు.
మంటలలో కొబ్బరి చెట్లు కాలిపోయిన రైతులకు పరిహారం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. మంటలను అరికట్టేందుకు అవసరమైతే జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారం తీసుకోవాలని సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా సంస్థలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.