|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 09:21 PM
దేశ రాజధాని ఢిల్లీలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలానాలను పరిష్కరించుకోవడానికి వాహనదారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించింది. జనవరి 10వ తేదీన (శనివారం) ఢిల్లీలోని అన్ని జిల్లా కోర్టు కాంప్లెక్స్ల్లో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. లోక్ అదాలత్లో చలానాల పరిష్కారం కోసం ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికార వర్గాలు వెల్లడించాయి. టోకెన్ లేనిదే కోర్టులోకి అనుమతించరని తేల్చి చెప్పాయి. ఇందుకోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నాయి.
ఈనెల 10వ తేదీన జరిగే నేషనల్ లోక్ అదాలత్లో పాల్గొనేందుకు వాహనదారులకు రిజిస్ట్రేషన్ లింక్ను ఇచ్చారు. https://traffic.delhipolice.gov.in/notice/lokadalat లింక్ను జనవరి 5వ తేదీన ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచారు. రోజుకు గరిష్టంగా 45 వేల చలానాలు.. మొత్తం మీద 1.80 లక్షల చలానాల వరకు మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్లాట్లు త్వరగా నిండిపోయే అవకాశం ఉన్నందున వెంటనే రిజిస్టర్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు.
ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ పోర్టల్లో 2025 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న కాంపౌండబుల్ చలానాలు మాత్రమే ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని అధికారులు తెలిపారు. https://traffic.delhipolice.gov.in/notice/lokadalat వెబ్సైట్కు వెళ్లి వాహనం నంబర్ లేదా చలానా నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ తర్వాత వాహనదారులు పాల్గొనాల్సిన కోర్టు పేరు, డేట్, టైమ్ కూడిన టోకెన్ను ప్రింట్ తీసుకోవాలని పేర్కొన్నారు.
జనవరి 10వ తేదీన కేటాయించిన కోర్టుకు టోకెన్.. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC), వాహదారుడి డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు తీసుకెళ్లాలి. జడ్జి సమక్షంలో ఆ ట్రాఫిక్ చలానాలను పరిశీలించి.. జరిమానాను తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది.
ఎలాంటి చలానాలు పరిష్కరిస్తారు?
హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడింగ్, రెడ్ లైట్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, పొల్యుషన్ లేని వంటి చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన విధించిన చలాన్లను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే.. మద్యం సేవించి వాహనం నడపడం, హిట్ అండ్ రన్ వంటి తీవ్రమైన కేసులు లోక్ అదాలత్ పరిధిలో పరిష్కరించరు.
Latest News