|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 11:23 PM
అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. వెనిజులాపై మెరుపు దాడి చేసిన అమెరికా దళాలు.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను నిర్బంధించి అమెరికాకు తరలించాయి. ఈ హైప్రొఫైల్ కేసు విచారణ ఇప్పుడు మన్హటన్ ఫెడరల్ కోర్టులో ప్రారంభమైంది. అయితే ఈ కేసులో నిందితుల కంటే కూడా.. వాదనలు వినే న్యాయమూర్తి, వాదించే న్యాయవాది వివరాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.
ఎవరీ 92 ఏళ్ల వైరల్ జడ్జి?
ఈ కేసును విచారిస్తున్న మన్హటన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అల్విన్ హెల్లర్స్టీన్ వయసు ఇప్పుడు 92 ఏళ్లు. 1933లో న్యూయార్క్లో జన్మించిన ఆయన.. అమెరికా న్యాయ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడిగా పేరుగాంచారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసిన అల్విన్.. తొలి నాళ్లలో ఆర్మీ లాయర్గా పని చేశారు. 1998లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆయన్ని జడ్జిగా నామినేట్ చేశారు. 9/11 అల్ఖైదా ఉగ్రదాడుల కేసు నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన 'హష్ మనీ' కేసు వరకు అనేక కీలక కేసులను ఈయనే విచారించారు. ముఖ్యంగా ట్రంప్ అభ్యర్థనలను తోసిపుచ్చడం, వెనిజులా డ్రగ్స్ ముఠాల అక్రమ రవాణాపై 15 ఏళ్లుగా విచారణ జరుపుతుండటం అల్విన్ ప్రత్యేకత. ఇప్పుడు అదే డ్రగ్స్ కేసులో మదురోను విచారించే బాధ్యత ఆయనపై పడింది.
అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని ఎదిరించి నిలబడాలంటే బలమైన న్యాయవాది కావాలి. అందుకే మదురో తన తరఫున వాదించేందుకు ప్రముఖ లాయర్ బారీ జె.పోలక్ను ఎంచుకున్నారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను 2024లో జైలు నుంచి విడిపించడంలో పోలక్ కీలక పాత్ర పోషించారు. మూడు దశాబ్దాల కెరీర్లో ఎంతోమంది రాజకీయ ఉద్దండులను కాపాడిన పోలక్.. ఇప్పుడు మదురోను అమెరికా చట్టాల నుంచి ఎలా రక్షిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Latest News