|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 09:40 PM
ప్రకృతి కన్నెర్ర చేస్తే... మనుషులు తట్టుకోవడం అసాధ్యం. గతేడాది కురిసిన భారీ వర్షాలు, వరదలు కలిగించిన నష్టమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే 2026, కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వరదలు జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి. ఆకస్మికంగా ముంచెత్తిన వరద 16 మందిని బలి తీసుకుంది. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్లో కుండపోత వర్షాల వల్ల సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగిల్చాయని అధికారులు వెల్లడించారు.
రుతుపవనాల ప్రభావం వల్ల సోమవారం నాడు కురిసిన భారీ వర్షాల వల్ల నదులు ఉప్పొంగాయి. దీనికి తోడు బురద, రాళ్లు, చెత్తాచెదారంతో కూడిన నీటి ప్రవాహాల వల్ల వరదలు సంభవించాయి. ఈ ఆకస్మిక వరదల ధాటికి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. సియావ్ టగులాంగ్ బియారో జిల్లాలోని గ్రామాలను వరద ముంచెత్తిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఉత్తర సులవేసి ఉత్తర కొనకు సుమారు 130 కిలోమీటర్ల (80 మైళ్లు) దూరంలో ఉన్న సియావ్ అనే చిన్న ద్వీపంలోని నాలుగు గ్రామాలు వరద వల్ల తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఈ క్రమంలో అత్యవసర రెస్క్యూ సిబ్బంది, పోలీసులు, సైన్యం సహాయంతో అక్కడకు చేరుకున్నారు. రోడ్లు బాగా దెబ్బతినడం, కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో... సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
ఈ భారీ ఆకస్మిక వరదల్లో కనీసం ఏడు ఇళ్లు కొట్టుకుపోగా, 140కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ వరదల కారణంగా 680 మందికి పైగా నివాసితులు చర్చిలు, ప్రభుత్వ భవనాల్లోని తాత్కాలిక ఆశ్రయాలకు తరలి వెళ్లాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. మంగళవారం వాతావరణం మెరుగుపడటం వల్ల వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో రెస్క్యూ సిబ్బంది 16 మృతదేహాలను వెలికితీశారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా మునిగిపోయిన చోట్ల మరో ముగ్గురు తప్పిపోయిన నివాసితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
సిటారో జిల్లా చీఫ్ చింత్యా ఇంగ్రిడ్ కలంగిట్, వరదల వల్ల 25 మంది గాయపడటంతో, సహాయం అందించడం, తరలింపు, మౌలిక సదుపాయాల మరమ్మతులను వేగవంతం చేయడానికి సోమవారం నుంచి 14 రోజుల అత్యవసర కాలాన్ని విధించారు. ఒకవేళ మరోసారి భారీ వర్షాలు కురిస్తే... వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని భావించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం భారీ ఎత్తున సహాయక సామాగ్రి, యంత్రాలను పంపింది. ఇంతకుముందు డిసెంబర్లో ఇండోనేషియాలోని అతిపెద్ద ద్వీపమైన సుమత్రాలో సంభవించిన విపత్తుకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల 52 నగరాలు, ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ఈ సంఘటనల్లో 1,178 మంది మరణించగా, 7,000 మందికి పైగా గాయపడ్డారు.