|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 07:03 PM
ప్రముఖ సంస్థ SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (SEIL) నెల్లూరు జిల్లాలో ఆస్పత్రిని నిర్మించనుంది. గురువారం రోజు ఎస్ఈఐఎల్ వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం నిర్మించనున్న ఆసుపత్రి ప్రాజెక్టుకు ఎస్ఈఐఎల్ శ్రీకారం చుట్టింది. SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనుంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలో రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న SEIL ఫౌండేషన్ హాస్పిటల్ ప్రాజెక్టుకు గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ముత్తుకూరు, టి.పి. గూడూరు, వెంకటాచలం, నెల్లూరు రూరల్ మండలాల్లోని నిరుపేదలకు ఈ ఆసుపత్రి ఒక వరమని కొనియాడారు.ఈ ప్రాంతవాసులంతా ప్రస్తుతం అత్యవసర వైద్యం కోసం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని, ఈ ఆస్పత్రి నిర్మా్ణంతో ఆ ఇబ్బందులు తప్పుతాయని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం SEIL సంస్థ తన సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 20 కోట్లు కేటాయించింది.
మరోవైపు ఈ సందర్భంగా మాట్లాడిన SEIL సీఈఓ జనమేజయ మహాపాత్ర.. సంస్థ ఎదుగుదలలో ఉద్యోగుల కృషి ఎంతో ఉందని అన్నారు. ఇక ఫౌండేషన్ డే వేడుకల్లో భాగంగా ఉద్యోగుల ఆరోగ్యం, ఐక్యతను చాటుతూ నిర్వహించిన వాకథాన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, SEIL ఉన్నతాధికారులు. ఉద్యోగులు పాల్గొన్నారు. నెల్లూరు కేంద్రంగా SEIL తన కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే కేవలం విద్యుత్ రంగంలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంది.
మరోవైపు కావలిలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన సబ్ స్టేషన్ మంజూరు చేయాలని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కోరారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల వలన రైతులు, వినియోగదారులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. ఈ నేపథ్యంలో స్పందించిన గొట్టిపాటి రవికుమార్.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నూతన సబ్స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Latest News