|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 08:03 PM
భారతదేశంలో గార్డెన్ సిటీగా పేరుగాంచిన కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో భారీ పార్కు రాబోతోంది. రూ.50 కోట్ల వ్యయంతో.. మొత్తం 153 ఎకరాల్లో శతాబ్ద కాలం తర్వాత భారీ విస్తీర్ణంలో 'విశ్వగురు బసవన్న బయోడైవర్సిటీ పార్క్'ను ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర బెంగళూరు ప్రజల కోసం ఈ పార్కులో అంబేడ్కర్ బర్డ్ శాంక్చురీ, కెంపెగౌడ మినీ జూ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండనున్నాయి. ఇప్పటికే బెంగళూరులో లాల్బాగ్, కబ్బన్ పార్కులు ఉండగా.. వాటి తర్వాత మూడో అతిపెద్ద పచ్చని ప్రదేశంగా ఈ పార్కు నిలవనుంది. ఈ విశ్వగురు బసవన్న బయోడైవర్సిటీ పార్క్ నిర్మాణానికి కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదముద్ర వేసింది.
బెంగళూరు నగరంలోని ఉత్తర ప్రాంతంలో ఎలహంక సమీపంలో ఉన్న మడప్పనహళ్లి వద్ద 153 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఈ పార్కు కేవలం టూరిస్ట్ స్పాట్గా మాత్రమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలవనుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో ఒక ప్రత్యేక బర్డ్ శాంక్చురీని ఈ పార్కులో ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరు నగర నిర్మాత నాడప్రభు కెంపెగౌడ గౌరవార్థం ఒక చిన్న జూను కూడా నిర్మించనున్నారు.
అరుదైన మూలికలు, ఔషధ మొక్కల కోసం ఈ విశ్వగురు బసవన్న బయోడైవర్సిటీ పార్కులో ప్రత్యేక విభాగాన్ని కేటాయిస్తారు. ప్రస్తుతం పార్కు నిర్మించాలని తలపెట్టిన ప్రాంతంలో యూకలిప్టస్ తోటలు ఉండేవి. అయితే.. యూకలిప్టస్ చెట్లు భూగర్భ జలాలను అధికంగా గ్రహిస్తాయని భావించి.. వాటిని తొలగించి వాటి స్థానంలో పశ్చిమ కనుమలకు చెందిన దేశీయ జాతుల మొక్కలను నాటాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల స్థానిక జీవవైవిధ్యం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ విశ్వగురు బసవన్న బయోడైవర్సిటీ పార్కు ప్రాజెక్టు ప్రారంభ దశ కోసం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసింది. రానున్న 3 ఏళ్లలో ఈ పార్కును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే కాలంలో డాక్టర్ శివరామ కారంత్ లేఅవుట్లో నివసించబోయే సుమారు 2 లక్షల మంది ప్రజలకు.. ఈ బయోడైవర్సిటీ పార్కు ఒక ప్రధాన 'లంగ్ స్పేస్' (ఊపిరితిత్తుల వంటి పచ్చని ప్రదేశం)గా మారనుంది.
Latest News