|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 02:02 PM
సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. శనివారం ఉదయం నుంచే రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణం, పంతంగి టోల్ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పండుగ సెలవులు మొదలవడంతో వేలాది మంది ఒకేసారి బయలుదేరడం, దీనికితోడు హైవేపై జరుగుతున్న నిర్మాణ పనులు కూడా తోడవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనదారులు విజయవాడ హైవేకు బదులుగా నాగార్జునసాగర్ హైవే మీదుగా ప్రయాణించడం మేలని పోలీసులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని సాగర్ హైవేలోకి ప్రవేశించవచ్చు. ఈ మార్గం కాస్త దూరం ఎక్కువైనా, ట్రాఫిక్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగించవచ్చని చెబుతున్నారు. సాధారణ మార్గంలో పంతంగి టోల్ప్లాజా వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు.అలాగే ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి మీదుగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ఓఆర్ఆర్ మీదుగా ఘట్కేసర్ వద్ద ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేపైకి చేరుకుని, అక్కడి నుంచి భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. చిట్యాల నుంచి నార్కట్పల్లిని దాటితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గుతాయని వివరిస్తున్నారు.అంతేకాకుండా ఆదివారం చౌటుప్పల్లో జరిగే వారంతపు సంతతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండుగ రద్దీకి సంత కూడా తోడైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని, కాబట్టి ఆదివారం ప్రయాణించే వారు కచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. వాహనదారులు ఓపికతో వ్యవహరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
Latest News