|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 08:32 PM
ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై ఒక ఆర్టీసీ బస్సులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు రన్నింగ్ బస్సు నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగింది.. ఎందుకు అతడు రన్నింగ్ బస్సు నుంచి దూకాల్సి వచ్చిందంటే.. ఫోన్పే ద్వారా బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని మోసం చేసి, రూ.90 వేలు కాజేశాడు. అయితే అతడి మోసం బయటపడటంతో.. పట్టుబడతాననే భయంతో రన్నింగ్ బస్సు నుంచి దూకాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
శనివారం నాడు వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట నుంచి ఒంగోలు వెళ్తున్న బస్సులో గోపీనాథ్ అనే యువకుడు మేదరమెట్ల దగ్గర బస్సు ఎక్కాడు. ప్రయాణంలో ఉండగా తనకు అత్యవసరంగా రూ.200 ఫోన్పే కావాలని బస్సులోని ప్రయాణికులను అడిగాడు. తనకు ఫోన్పే చేస్తే క్యాష్ ఇస్తానని చెప్పాడు. దీంతో అదే బస్సులో ఉన్న మురళీకృష్ణ అనే వ్యక్తి అతనికి సహాయం చేసి, గోపీనాథ్ ఫోన్పే ఖాతాకు రూ.200 పంపించాడు. అందుకు గోపీనాథ్ అతనికి నగదుగా రూ.200 ఇచ్చాడు.
ఆ తర్వాత గోపీనాథ్.. తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని, అత్యవసరంగా కాల్ చేయాలని మురళీకృష్ణ ఫోన్ తీసుకున్నాడు. కాల్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ, ముందే చూసుకున్న ఫోన్పే పాస్వర్డ్ను ఉపయోగించి, మురళీకృష్ణ ఫోన్పే నుంచి మరో నంబర్కు రూ.90,000 డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఏం జరగనట్లే మురళీకృష్ణ ఫోన్ అతడికి ఇచ్చేశాడు.
కొద్దిసేపటి తర్వాత, మురళీకృష్ణకు అనుమానం వచ్చి తన ఫోన్ తిరిగి తీసుకుని పరిశీలించాడు. ఫోన్పే ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ అయినట్లు గమనించి షాక్ అయ్యాడు. గోపీనాథ్ను నిలదీయడంతో, తన మోసం బయటపడిందని గ్రహించిన గోపీనాథ్, భయంతో రన్నింగ్లో ఉన్న బస్సు కిటికీలోంచి బయటకు దూకేశాడు. ఈ ప్రమాదంలో గోపీనాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News