|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 09:12 PM
న్యాయస్థానంలో న్యాయమూర్తితో వాగ్వాదానికి దిగిన ఓ లాయర్2కు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. న్యాయమూర్తిని కించపరిచేలా మాట్లాడినందుకు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన క్రిమినల్ కంటెంప్ట్ నోటీసుపై లాయర్ మహేష్ తివారీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గతేడాది అక్టోబర్ 16న జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ కుమార్తో న్యాయవాది మహేష్ తివారీ వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో న్యాయమూర్తిని ‘హద్దులు దాటవద్దు’ అని తివారీ హెచ్చరించారు. దీంతో హైకోర్టు ఆయనపై క్రిమినల్ కంటెంప్ట్ నోటీసు జారీ చేసింది.
ఈ నోటీసును సవాలు చేస్తూ తివారీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్... తివారీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘మీరు నన్నేం చేయలేరని చూపించుకోవడానికే సుప్రీంకోర్టుకు వచ్చారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తివారీ క్షమాపణ చెప్పాలనుకుంటే చెప్పాలని, లేదంటే న్యాయమూర్తులకు కళ్లెర్ర చేసి చూపిస్తానంటే తాము కూడా చూస్తామని హెచ్చరించారు.
అయితే, లాయర్ క్షమాపణ చెబితే హైకోర్టు సానుకూలంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. విద్యుత్ బిల్లులు కట్టలేక కనెక్షన్ కట్ అయిన ఓ వితంతువు తరఫున లాయర్ తివారీ వాదిస్తున్న సమయంలో హైకోర్టు న్యాయమూర్తితో వాగ్వాదానికి దిగారు. తన క్లయింట్కు ఉపశమనం కల్పించాలని తివారీ వాదిస్తున్నారు. క్లయింట్ రూ. 25,000 డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తివారీ చెప్పినా, న్యాయమూర్తి మొత్తం బకాయిలో 50 శాతం డిపాజిట్ చేయాలని చెప్పారు. చివరికి, తివారీ రూ. 50,000 డిపాజిట్ చేయడానికి అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది.
కానీ, కేసు ముగిసిన తర్వాత తివారీ వాదన తీరుపై న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి తివారీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నేను నా పద్ధతిలోనే వాదిస్తాను, మీ పద్ధతిలో కాదు. దయచేసి గుర్తుంచుకోండి... ఏ న్యాయవాదినైనా అవమానించడానికి ప్రయత్నించవద్దు, నేను మీకు చెబుతున్నాను’ అని అన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ‘కోర్టు అన్యాయం చేస్తోందని మీరు చెప్పలేరు’ అని బదులిచ్చారు.
‘నేను చెప్పానా? దయచేసి రికార్డింగ్ చూడండి. నేను మీ ముందు ప్రార్థించాను... దేశం న్యాయవ్యవస్థతో మండిపోతోంది. ఇవి నా మాటలు. ఏ న్యాయవాదినైనా అవమానించడానికి ప్రయత్నించవద్దు. మీరు న్యాయమూర్తి కాబట్టి మీకు చాలా తెలుసు, మేము న్యాయవాదులం కాబట్టి మాకు తక్కువ తెలుసా? నేను నా పద్ధతిలోనే వాదిస్తాను. హద్దులు దాటవద్దు. దయచేసి, హద్దులు దాటవద్దు. నేను గత 40 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాను’ అని తివారీ తీవ్రస్థాయిలో మాట్లాడి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన జార్ఖండ్ హైకోర్టు ధర్మాసనం ఆయనకు కంటెంప్ట్ నోటీసు జారీ చేసింది.
Latest News