|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 09:15 PM
ఏపీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా వైసీపీ రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఆయనను అధికారులు సుమారు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించి, కీలక వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-2024 మద్యం విధానంలో చోటుచేసుకున్న అక్రమాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతంలోనే మిథున్ రెడ్డికి సమన్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మద్యం విధాన రూపకల్పన, డిస్టిలరీలతో సంబంధాలు, నిధుల లావాదేవీల వంటి పలు కీలక అంశాలపై అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.విచారణ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాలు ఉన్నందున తాను ఎలాంటి వివరాలు వెల్లడించలేనని స్పష్టం చేసి, అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. గతంలో ఏపీ పోలీస్ సిట్ ఇదే కేసులో మిథున్ రెడ్డిని ఏ5 నిందితుడిగా చేర్చి అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు.సఈ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని గురువారం దాదాపు ఏడు గంటల పాటు విచారించిన మరుసటి రోజే మిథున్ రెడ్డిని విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయసాయి రెడ్డి వాంగ్మూలం ఆధారంగా లభించిన సమాచారంతోనే ఈడీ దర్యాప్తును ముందుకు తీసుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ వరుస విచారణలతో కేసులో మరిన్ని కీలక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, మరికొందరు ప్రముఖులకు కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.
Latest News