|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 10:54 PM
అంతర్జాతీయ వేదికలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. సంచలనాలు సృష్టించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ప్రసంగించిన అనంతరం.. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనను తాను నియంతగా అభివర్ణించుకున్నారు. "చాలామంది నన్ను నియంత అని విమర్శిస్తుంటారు.. అవును, నేను నియంతనే. కానీ కొన్నిసార్లు వ్యవస్థలను చక్కదిద్దడానికి దేశానికి అలాంటి నియంత అవసరం" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దావోస్ ప్రసంగానికి లభించిన స్పందన పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తూనే.. తన విమర్శకులపై విరుచుకుపడ్డారు. "సాధారణంగా నన్ను ఒక భయంకరమైన నియంతలా చూస్తారు. కానీ నా నిర్ణయాలన్నీ కేవలం కామన్ సెన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఇందులో లిబరల్ లేదా కన్జర్వేటివ్ అనే భేదం లేదు" అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలోనూ (2024 ఎన్నికలకు ముందు) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అధికారం చేజిక్కించుకున్న తర్వాత కేవలం మొదటి రోజు మాత్రమే నియంతలా ఉంటానని వ్యాఖ్యానించారు.
పట్టుదల ఉన్న నేతలపై ట్రంప్ ప్రేమ
ట్రంప్ తన ప్రసంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలమైన నేతలను మరోసారి కొనియాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను చాలా తెలివైన వాడని, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను అత్యంత గౌరవనీయమైన వ్యక్తి అని ప్రశంసించారు. అలాగే ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా టఫ్ అని, తమ మధ్య ఒకరకమైన స్నేహ బంధం ఉందని గుర్తు చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటేనే ట్రంప్నకు పట్టుదల ఉన్న వ్యక్తులపై మక్కువ ఎక్కువ అని తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని, లేదంటే యూరప్ దేశాలపై భారీ సుంకాలు విధిస్తానని బెదిరించిన ట్రంప్.. దావోస్ వేదికగా అనూహ్యంగా వెనక్కి తగ్గారు. గ్రీన్లాండ్ కోసం సైనిక బలాన్ని వాడబోమని, అలాగే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రావాల్సిన సుంకాలను కూడా ప్రస్తుతానికి నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. నాటో చీఫ్ మార్క్ రుట్టేతో జరిగిన చర్చల తర్వాత ఆర్కిటిక్ ప్రాంతం కోసం ఒక కొత్త ముసాయిదా ఒప్పందం సిద్ధం అవుతోందని, దీనివల్ల యూరప్ దేశాలకు ఊరట లభిస్తుందని ట్రంప్ వెల్లడించారు.
Latest News