|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 11:13 PM
ఆడ పిల్లల పేరుపై పెట్టుబడి పెట్టి వారి ఉన్నత చదువులు, పెళ్లి కోసం పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందించేలా రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన మరో మైలురాయిని చేరుకుంది. ఈ స్కీమ్ లాంచ్ చేసి నేటికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. సుకన్య యోజనను బేటీ బచావో, బేటీ పడావో క్యాంపెయిన్లో భాగంగా 2015, జనవరి 22వ తేదీన కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లాంచ్ చేసింది. ఆడ పిల్లల భవిష్యత్తకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకం ఇది. 11 వసంతాలు పూర్తి చేసుకున్న క్రమంలో ఈ స్కీమ్ ద్వారా రూ.72 లక్షలు అందుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజనలో చేసే పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్పై 8.20 శాతం వడ్డీ అందిస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును సమీక్షిస్తారు. ఇది లో రిస్క్ డిపాజిట్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. ఇందులో వడ్డీని ప్రతి నెలా లెక్కిస్తారు. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వడ్డీని అసలుకు కలిపుతారు. దీంతో ప్రతి ఏటా వడ్డీపైన వడ్డీ జనరేట్ అవుతుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు సైతం క్లెయిమ్ చేసుకునేందుకు ఈ స్కీమ్ అర్హత ఉంటుంది. అయితే, పాత పన్ను విధానం ఎంచుకున్న ట్యాక్స్ పేయర్లకు మాత్రమే ఈ బెనిఫిట్ ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజనలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస పెట్టుబడి రూ.250గా ఉండగా గరిష్ఠంగా రూ.1.50 లక్షలుగా నిర్ణయించారు. రూ.1.50 లక్షలను ఒకేసారి లంప్సమ్ విధానంలో లేదా విడతల వారీగానూ ఎస్ఎస్వై ఖాతాకు జమ చేయవచ్చు. 15 సంవత్సరాల పాటు ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ తెరిచినప్పటి నుంచి 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ ఉంటుంది. మరి ఏడాదికి రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఎంతొస్తుంది? అనేది తెలుసుకుందాం.
ఒక వ్యక్తి తనకు కూతురు పుట్టిన వెంటనే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచి ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షలు జమ చేశాడు అనుకుందాం. పాపకు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. 15 సంవత్సరాల పాటు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 6 సంవత్సరాల పాటు ఎలాంటి చెల్లింపులు లేకుండానే వడ్డీ వస్తుంది. ప్రస్తుతం ఇందులో 8.20 శాతం వడ్డీ ఇస్తున్నారు. మొత్తం డిపాడిట్ రూ.22,50,000 అవుతుంది. దీనిపై వడ్డీ రూ.49,32,119 వస్తుంది. అంటో మొత్తం రూ.71,82,119 వస్తాయి. అయితే, ఈ మేరకు మెచ్యూరిటీ సొమ్ము రావాలంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1-5 తేదీల్లోపు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు నెలకు రూ.12,500 చెల్లిస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.69.33 లక్షలు వస్తాయి.
Latest News