|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 08:07 PM
త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో రాజకీయాల్లో హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే.. అక్కడ ఎలక్షన్ వేడి మొదలైంది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా డీఎంకేతో కలిసి తమిళనాడులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు పార్టీ భవిష్యత్ వ్యూహాలపై తీవ్ర మథనం ప్రారంభమైంది. పాత మిత్రుడిగా ఉన్న స్టాలిన్తోనే ఈ ఎన్నికల్లోనూ పోటీ చేసి కొనసాగాలా.. లేక కొత్తగా పుట్టుకొచ్చిన హీరో విజయ్ పార్టీ టీవీకేతో చేతులు కలపాలా అనే మీమాంసలో హస్తం పార్టీ పడింది. మరోవైపు.. రోజురోజుకూ ఓట్ల శాతం తగ్గుతున్న తరుణంలో.. తమ ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం తమిళ పాలిటిక్స్లో అత్యంత కీలకం కానుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. రాహుల్ గాంధీలతో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత తమిళనాడు కాంగ్రెస్ కమిటీ.. రేపు (ఆదివారం) కీలక కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం.. పొత్తుల అంశంపై స్పష్టత తీసుకురావడం ఈ భేటీ వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే 5200 మందికి పైగా ఆశావహుల నుంచి దరఖాస్తులు అందడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో చిచ్చు పెట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్జీవో కాదని.. ప్రభుత్వంలో తమకు కూడా వాటా ఉండాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వాలు పని చేయవంటూ డీఎంకే ఈ ప్రతిపాదనను కొట్టి పారేసింది. ఈ నేపథ్యంలోనే.. 58 ఏళ్లుగా తమిళనాడులో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
విజయ్ రూపంలో కాంగ్రెస్కు కొత్త ఆప్షన్
గతేడాది రాజకీయాల్లోకి వచ్చిన తమిళ నటుడు దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే టీవీకే పార్టీ.. కాంగ్రెస్ పార్టీని తమకు సహజ మిత్రుడిగా అభివర్ణిస్తోంది. డీఎంకేతో సీట్ల సర్దుబాటు లేదా అధికారం పంపకంలో తేడాలు వస్తే.. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ విజయ్తో కలిసే అవకాశం ఉందనే ఊహాగానాలు ఆ రాష్ట్రంలో జోరందుకున్నాయి. అయితే.. కొత్త పార్టీతో వెళ్లడం ఒక సాహసమేనని హస్తం పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
అయితే తమిళనాడులో నానాటికీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం క్షీణిస్తోంది. 2011లో 9.3 శాతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు.. 2021 నాటికి 4.27 శాతానికి పడిపోయింది. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తా.. డీఎంకే కూటమిలో భాగంగా 25 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. 18 చోట్ల విజయం సాధించింది. దీంతో ఈసారి.. 40 కంటే ఎక్కువ సీట్లు కావాలని హస్తం పార్టీ పట్టుబడుతోంది.
Latest News