|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 12:31 PM
సీఎం చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని, వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని వైయస్ఆర్సీపీ కర్నూలు జిల్లా పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం భూసర్వే, లాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఇన్నాళ్లు దుష్ప్రచారం చేశారని, ఇవాళ అంతర్జాతీయ వేదికల్లో వైయస్ జగన్ను మేధావులు కొనియాడుతున్నారని గుర్తు చేశారు. కుడా మాజీ చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ డా" ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి ,పార్టీ పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ గంగుల ప్రభాకర్రెడ్డి, తదితరులు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు,పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ కార్యక్రమాన్ని సమగ్రంగా క్రమపద్ధతిగా, పారదర్శకంగా పూర్తిచేయడానికి ఒక ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కల్పలతారెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన నడుస్తోంది. రౌడీ రాజ్యం రాజ్యమేలుతోంది. ఈ అప్రజాస్వామిక పాలనను తరిమికొడదామని, రాజన్న రాజ్యాన్ని వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకొని తెచ్చుకుందామన్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హాయంలో చేయించిన భూముల సర్వేపై లక్షల అర్జీలు వస్తున్నాయని చెప్తున్న వారు ఈ రెండేళ్లలో వాటిని ఎందుకు తీర్చలేదని ప్రశ్నించారు వైయస్.జగన్ చేయించిన సర్వే ఆధారంగా ఇచ్చిన పాస్ పుస్తకాల్ని ఈ ప్రభుత్వం తప్పుబడుతోందని, కానీ ఇవే పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో రూపొందించి, నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపించిందని స్పష్టం చేశారు. భూమి అంశం రాష్ట్ర పరిధిలో ఉండటంతో రాష్ట్రాలు చట్టం చేయాలని కేంద్రం సూచించిందని తెలిపారు. అటువంటి చట్టాన్ని ఇప్పుడు “భూములు కొట్టేయడానికి” తెచ్చిన చట్టమని ఆరోపించడం అవగాహన లేనితనమా? లేక ప్రజలను మోసగించడానికా? అని ప్రశ్నించారు. ఈ చట్టం దేశ ప్రయోజనాల కోసమేనని, భూ వివాదాలు తగ్గించేందుకు, భూమి హక్కుదారులకు భద్రత కల్పించేందుకు, కోర్టుల్లో సంవత్సరాల తరబడి నలుగుతున్న రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తీసుకువచ్చారని వివరించారు. చట్టం శాసనసభలో ఆమోదం పొందినప్పుడు టీడీపీ సభ్యులు కూడా ఉన్నారని, అప్పట్లో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. అప్పట్లో అంగీకరించి, ఇప్పుడు దొంగచట్టమని మాట్లాడటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
Latest News