|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 07:43 PM
కరవు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఓ కొత్త రకమైన పంట రైతుల ముఖాల్లో ఆనందం నింపుతోంది. అనంతపురం జిల్లా అంటేనే వర్షాభావ పరిస్థితులకు, నీటి కొరతకు పేరు. ఇలాంటి వాతావరణ పరిస్థితులలో తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో లాభాలను తెచ్చిపెట్టే ఓ పంట రైతులకు ఆశను కల్పిస్తోంది. సంప్రదాయ పంటలు లాభదాయకంగా లేని పరిస్థితులలో అనంతపురం రైతులు ఈ ప్రత్యామ్నాయ పంటవైపు ఆసక్తి చూపుతున్నారు. అదే చియా సాగు . చియా సాగుకు.. పెద్ద మొత్తంలో నీరు అవసరం లేదు. అలాగే పెట్టుబడి కూడా తక్కువ. దీంతో రైతులు చియాసాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో రైతులు చియా సాగుతో లాభాలు గడిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా రైతులు కూడా చియా సాగు మీద ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు చియా అనేది మెక్సికో దేశానికి చెందిన పంట. చియా విత్తనాలలో ఫైబర్, ఒమేగా–3 వంటి పోషకాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికం. దీంతో మార్కెట్లో చియా గింజలకు మంచి డిమాండ్ ఉంది. చియా సాగులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ పంటకు సేంద్రియ ఎరువులనే ఉపయోగించాలని అధికారులు చెప్తున్నారు. అప్పుడే చియా విత్తనాల దిగుబడి, పోషక విలువలలో నాణ్యత ఉంటుందంటున్నారు. అలాగే మూడు నెలలకోసారి పంట చేతికి వస్తుంది. వర్షాకాలం తప్ప ఏడాదిలో రెండు సార్లు పంట తీయవచ్చు. ముఖ్యంగా శీతాకాలం చియాసాగుకు అనుకూలం. దీనికి తోడు చియా సాగులో తెగుళ్లు, చీడపీడల బెడద ఉండదని అధికారులు చెప్తున్నారు.
ఈ క్రమంలోనే తాడిపత్రి నియోజకవర్గంలోని యల్లనూరుకు చెందిన సాంబశివారెడ్డి అనే రైతు కర్ణాటక రైతుల నుంచి చియా విత్తనాలను సేకరించి చియా సాగు మొదలుపెట్టాడు. చియా సాగు కోసం ఎకరాకు 15 వేల వరకూ పెట్టుబడి ఖర్చు అవుతోందని సాంబశివారెడ్డి తెలిపారు. తాను మూడు ఎకరాలలో పంట సాగు చేశానని వెల్లడించారు. ఎకరాకు 3 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చియా గింజలు రూ.200 వరకూ పలుకుతున్నాయని తెలిపారు. తనకు 45 వేల రూపాయల పెట్టుబడి కాగా.. రూ.1.80 లక్షలు వస్తుందని తెలిపారు. ఆ లెక్కన పెట్టిన పెట్టుబడికి 4 రెట్లు అంటే 400 శాతం ఆదాయం సమకూరుతుందని అంచనా.
Latest News