|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 08:00 PM
అనంతపురం నగరం శివారు ప్రాంతంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఓ రకమైన ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ ప్రాంగణంలో గత మూడు రోజులుగా పక్షులు అకస్మాత్తుగా చనిపోతూ ఉండటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పదుల సంఖ్యలో కాకులు చనిపోతున్నాయి. ఎస్కే యూనివర్సిటీ ఆవరణతో పాటు సమీపంలో ఉన్న వనమిత్ర అటవీ ఉద్యానవన ప్రాంతంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అక్కడ పావురాలు చనిపోతున్న పరిస్థితి. చెట్ల మీద ఉన్న పక్షులు.. అకస్మాత్తుగా కిందపడి ఉన్నట్లుండి ప్రాణాలు విడుస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇందుకు ఇన్ఫ్లూయెంజా వైరస్ కారణమని అధికారులు చెప్తున్నారు.
ఈ వింత మరణాలపై సమాచారం అందుకున్న ఎస్కేయూ బోటనీ, జువాలజీ విభాగాధిపతి ఆచార్య రవిప్రసాద్ రావు శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన కాకులను పరిశీలించారు. ఇవి కారణంగా ఇన్ఫ్లూయెంజా వైరస్ కారణంగా చనిపోతున్నాయని ఆయన తెలిపారు. వాతావరణ మార్పులు లేదా ఇతర వలస పక్షుల ద్వారా ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇలా చనిపోయిన పక్షులను నేరుగా తాకితే శ్వాసకోశ, కళ్లకలక వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. కర్రల సాయంతో వీటిని భూమిలో పూడ్చటం లేదా దహనం చేయాలని ఆయన సూచించారు.
మరోవైపు ఇటీవలి కాలంలో కేరళలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. కన్నూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో కాకులు చనిపోయాయి. దీంతో అధికారులు దిగి పరీక్షలు నిర్వహించారు. H5N1 వైరస్ కారణంగా అవి చనిపోయినట్లు గుర్తించారు. అయితే కాకుల నుంచి వేరే పక్షులకు ఈ వైరస్ సోకలేదని తెలిపారు. ఆ ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. మరోవైపు H5N1 అనేది ఇన్ఫ్లూయెంజా వైరస్. దీని కారణంగా పక్షులలో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఈ వైరస్ కారణంగా చనిపోయిన పక్షులను నేరుగా తాకితే మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలా చనిపోయిన వాటిని లోతుగా గోతి తీసి పూడ్చిపెట్టాలని లేదా.. దహనం చేయాలని సూచిస్తున్నారు.