|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 08:05 PM
అనంతపురం జిల్లా.. దేశంలోనే కరవు కాటకాలకు పేరొందిన జిల్లా. బీడువారిన భూములు.. మోడువారిన మోములు.. నీరు లేక ఎండిన పంటలు.. ఆశలు కూలి రాలిన బతుకులు.. పెన్నా పరవళ్లు. చిత్రావతి చిందులు మూగబోయి.. పంట పొలాలపై కమ్మేస్తున్న ఇసుక మేటలు.. అయినా ఎర్రని ఎండకు ఒంట్లో మరిగే రక్తంతో.. భూమాతపై నమ్మకంతో.. రేపటి మీద ధైర్యంతో.. నమ్ముకున్న సేద్యంపై ప్రేమతో.. ముందడుగు వేసే రైతన్న.. ఇదీ పేరులోనే పేదరికాన్ని నింపుకున్న అనంతపూర్ జిల్లా ఒకప్పటి పరిస్థితి. కానీ రోజులు మారుతున్నాయ్.. రైతులు సేద్యం చేసే తీరు మారుతోంది.. వెరసి అనంతపురం జిల్లా దేశానికి స్ఫూర్తిగా నిలిచేలా అడుగులు వేస్తోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన ప్రసంగంలో అనంతపురం జిల్లాను ప్రశంసించారంటే.. అర్థం చేసుకోవచ్చు.
ఆదివారం మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల గురించి తన ప్రసంగంలో పేర్కొనే ప్రధాని ఈసారి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనేందుకు.. అనంతపురం జిల్లా ప్రజలు చేపడుతున్న చర్యలను మోదీ ప్రశంసించారు. వర్షం సరిగా కురవని పరిస్థితులలో, తీవ్ర నీటి కొరత కారణంగా పడే ఇబ్బందులను ఎదుర్కొనడానికి అనంతపురం జిల్లా ప్రజలు స్వయంగా జలాశయాలను పునరుద్ధరించుకుంటున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఇప్పటి వరకూ ఇలా పదికిపైగా జలాశయాలను పునరుద్ధరించుకున్నారని అభినందించారు. ఏడు వేలకు పైగా చెట్లను నాటిన విషయాన్ని గుర్తు చేశారు.
"అనంతపురం జిల్లా తీవ్రమైన నీటి కొరతతో ఇబ్బందులు పడుతోంది. ఇక్కడ ఎర్రమట్టి నేలలు, ఇసుక నేలలు ఉన్నాయి. ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి చాలా ప్రాంతాల్లో సరైన వర్షపాతం లేదు. అనంతపురం పరిస్థితిని చాలాసార్లు ఎడారి పరిస్థితులలో పోల్చారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు అక్కడి జనం జలాశయాలను క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో ఆ పని చేపట్టారు.
అనంత నీరు సంరక్షణ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ ప్రయత్నాలతో పదికి పైగా జలాశయాలను పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ జలాశయాలలో నీరు చేరింది. అలాగే 7 వేలకుపైగా చెట్లను నాటారు. నీటి సంరక్షణ విధానాలే కాదు అనంతపురంలో పచ్చదనం కూడా పెరిగింది. చిన్న పిల్లలు వాటిలో ఈత కూడా కొడుతున్నారు. వారి కృషితో ఆ ప్రాంతంలో ఎకోసిస్టమ్ మొత్తం మారిపోయింది. "
Latest News