|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 08:37 PM
భారత్లోని అమెరికా కాన్సులేట్లు హెచ్-1 బీ వీసా ఇంటర్వ్యూ స్టాంపింగ్ తేదీలను 2027 వరకు వాయిదా వేయడంతో అక్కడ పనిచేస్తోన్న భారతీయ నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని అమెరికా కాన్సులేట్స్లో రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో లేవు. అయితే, ఈ జాప్యం 2025 డిసెంబర్లో ప్రారంభమైంది. డిసెంబర్ నెలలో జరగాల్సిన అపాయింట్మెంట్లను మార్చి 2026కి మార్చారు. ఆ తర్వాత అక్టోబర్ 2026కి, ఇప్పుడు తాజాగా 2027కి వాయిదా వేశారు. హెచ్-1 బీ వీసా ప్రోగ్రామ్ను అమెరికా పునర్వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో ఈ జాప్యం ఏర్పడింది.
డిసెంబర్ 29, 2025న అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ 2027 ఆర్థిక సంవత్సరానికి కొత్త నిబంధనలను విడుదల చేసింది. వార్షిక వీసాల పరిమితి 85,000లో ఎలాంటి మార్పులేదు. ఇందులో 20,000 వీసాలను అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందిన దరఖాస్తుదారుల కోసం రిజర్వ్ చేశారు. కొత్త విధానాలు కూడా ఈ ఆలస్యానికి కారణమయ్యాయి. ఉద్యోగ-ఆధారిత వీసా దరఖాస్తుదారుల కోసం తప్పనిసరి సోషల్ మీడియా స్క్రీనింగ్ను అమెరికా డిసెంబరు 15న ప్రవేశపెట్టింది. ఈ అదనపు పరిశీలన ప్రాసెసింగ్ సమయాన్ని పెంచింది. ప్రతిరోజూ కాన్సులేట్లు నిర్వహించగల ఇంటర్వ్యూల సంఖ్యను తగ్గించింది.
అలాగే, భారతీయులు వేరే దేశాలలో వీసా స్టాంపింగ్ పొందే విధానాన్ని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ రద్దుచేసింది. దీని వల్ల పూర్తిగా భారత్లో అమెరికా కాన్సులేట్లపై భారం పడి, ఆలస్యాన్ని మరింత తీవ్రతరం చేసింది. USCIS కొత్త విధానం లాటరీలో వేతనం, అనుభవ స్థాయిలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. లెవల్ IV ఉద్యోగుల కోసం పిటిషన్లు దాఖలు చేసే యజమానులు నాలుగు లాటరీ ఎంట్రీలను, లెవల్ III ఉద్యోగులు మూడు, లెవల్ II ఉద్యోగులు రెండు, లెవల్ I ఉద్యోగులు ఒక ఎంట్రీని పొందుతారు. లాటరీ మార్చి ప్రారంభంలో మొదలుకానుంది.
అమెరికా యాజమాన్యాలు ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టెక్ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ, విద్యా సంస్థలు కోసం హెచ్-1 బీ వీసా నిపుణులపై ఎక్కువగా ఆధారపడతాయి. ఉద్యోగుల దీర్ఘకాలిక గైర్హాజీలతో ప్రాజెక్టులను జాప్యం చేయడమే కాదు ఖర్చులను పెంచాయి. కొన్ని సంస్థలు ఇప్పుడు పరిమిత రిమోట్ పనిని అనుమతించి, బాధ్యతలను తాత్కాలికంగా మారుస్తున్నాయి. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ ఐటీ కంపెనీలతో సహా మరికొన్ని, రిస్క్ను తగ్గించడానికి అమెరికా పౌరులను నియమించుకోవడం పెంచాయి. నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తున్నందున, సుదీర్ఘమైన జాప్యం ప్రపంచ ప్రతిభను ఆకర్షించడంలో అమెరికా సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.