హనుమాన్ విగ్రహం చుట్టూ శునకం ప్రదక్షణలు.. తిరిగింది భక్తితో కాదు, అసలు విషయం వేరే
 

by Suryaa Desk | Sun, Jan 25, 2026, 08:45 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ శునకం ఇటీవల స్థానిక ఆలయంలోని హనుమాన్ విగ్రహం చుట్టూ ప్రదక్షణలు చేసింది. దీంతో ఆ వీధి కుక్క రాత్రికి రాత్రే ఫేమస్ అయింది. భక్తులు దానికి భైరవ్ అని నామకరణం చేసి.. పూజలు చేయడం మొదలుపెట్టారు. అయితే కుక్క అలా ప్రదక్షణలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని పరిశీలించిన వెటర్నరీ వైద్యలు.. ఆ శునకం భక్తితో అలా విగ్రహం చుట్టు తిరగడం లేదని.. అది నాడీ సంబంధిత రుగ్మత కారణంగా అది అలా చేస్తోందని చెప్పారు. అనంతరం ఆ వీధి కుక్కను పలువురు పశువైద్యులు, జంతు హక్కుల కార్యకర్తలు రక్షించారు.


వైరల్ వీడియోలు కొందరు జంతు హక్కుల కార్యకర్తలు, పశువైద్యుల దృష్టికి వెళ్లడంతో.. వారికి సమస్య ఏమిటో అర్థమైంది. చికిత్స కోసం కుక్కను తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే దాన్ని తీసుకెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై జంతు కార్యకర్త సంధ్యా రస్తోగి మాట్లాడుతూ.. భైరవ్ బలహీనంగా, డీహైడ్రేషన్‌కు గురయ్యాడని చెప్పారు. తినడం పూర్తిగా మానేశాడని చెప్పారు. ఈ క్రమంలో రస్తోగి, ఆమె బృందం కొన్ని రోజులు అక్కడే ఉండి.. భక్తులకు కుక్క అనారోగ్యంగా ఉందని, అత్యవసర వైద్య సంరక్షణ అవసరమని చెప్పడానికి ప్రయత్నించారు.


కాగా, కుక్క పరిస్థితి విషమంగా ఉండటంతో కనీసం ద్రవ పదార్థాలు ఇవ్వడానికి అనుమతించాలని ఆలయ అధికారులను వేడుకుంది రస్తోగి బృందం. అయితే భక్తులు లేనప్పుడు, చీకటి పడిన తర్వాత మాత్రమే అలా చేయాలని కండిషన్లు పెట్టారు. అయితే భైరవ్ కనీసం నిలబడలేక పోయాడని.. అందుకే అర్థరాత్రి రక్షించి తీసుకొచ్చామని సంధ్యా రస్తోగి తెలిపారు.


అనంతరం ఢిల్లీలో ఆ శునకానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం భైరవ్ కోలుకున్నాడని.. వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పారు వైద్యులు. కాగా, ప్రస్తుతం భైరవ్‌ను నోయిడాకు చెందిన హౌస్ ఆఫ్ స్ట్రే యానిమల్స్ వ్యవస్థాపకుడు సంజయ్ మోహపాత్ర జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇటీవలి జరిగిన ప్రమాదం లేదా గాయం కారణంగా.. భైరవ్‌కు నరాల సంబంధిత రుగ్మత ఏర్పడినట్లు ఎంఆర్ఐ స్కానింగ్ నిర్ధారించిందని తెలిపారు.


కాగా, టిక్ ఫీవర్ అని అనప్లాస్మాగా రక్త పరీక్షల్లో తేలిందన్నారు మహాపాత్ర. భక్తులు సమర్పించిన అనుచితమైన ఆహారం, అందులోనూ గాజర్ హల్వా, పూరీల వంటి స్వీట్ల కారణంగా భైరవ్ పేగులు వాచిపోయినట్లు అల్ట్రాసౌండ్ పరీక్షలో వెల్లడైందని తెలిపారు. ఆ ఆహారం భైరవ్ జీర్ణవ్యవస్థను మరింత దెబ్బతీసి, జీర్ణకోశ సంబంధిత సమస్యలకు దారితీసిందని ఆయన చెప్పారు. భైరవ్ ఇప్పుడు కోలుకుంటున్నట్లు.. త్వరలోనే బిజ్నోర్‌కు తిరిగి వచ్చేలా చూస్తామని మహాపాత్ర తెలిపారు.

Latest News
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
Mon, Feb 23, 2026, 03:33 PM
Mobile ban in Karnataka schools under discussion, parents also exerting pressure: Deputy CM Shivakumar Mon, Feb 23, 2026, 03:32 PM
Congress targets MP BJP govt over Ladli Behna Yojana Mon, Feb 23, 2026, 03:31 PM